Tirumala Brahmotsavam 2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Tirumala Brahmotsavam 2022 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు భక్తులకు కనువిందు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
Tirumala Brahmotsavam 2022 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
మోహినీ అవతారం - మాయా మోహ నాశనం…
మోహిని అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలోపెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజ, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
గరుడ వాహనం….
రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు కటాక్షిస్తారు. గరుడ వాహనం - సర్వపాప ప్రాయశ్చిత్తంగా భక్తులు భావిస్తారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
మోహినీ అలంకారంలో ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 24 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.
మోహినీ అవతారం నృత్యరూపకం
పశ్చిమగోదావరి జిల్లా పురుషోత్తమపట్నంకు చెందిన గరుడాద్రి శేషాద్రి కళాబృందం మోహినీ అవతార నృత్య రూపకాన్ని చక్కగా ప్రదర్శించారు. క్షీరసాగర మథనంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోటీ పడడం, మోహినిగా స్వామివారు రంగప్రవేశం, అమృతాన్ని దేవతలకు పంచడం వంటి ఘట్టాలను ప్రత్యేక వేషధారణలతో ఆవిష్కరించారు.
తప్పెట గుళ్ల జానపద నృత్యం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన కళాకారులు ప్రదర్శించిన తప్పెట గుళ్లు జానపద నృత్యం భక్తులను ఆకట్టుకుంది. పాదానికి సిరిమువ్వలు, తొడకు పెద్ద మువ్వలు, రంగురంగుల కాశికోట, ఛాతిపై తప్పెటను అమర్చుకుని కళాకారులు ప్రదర్శించారు. వీరు శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరాముడు, శ్రీకష్ణునికి సంబంధించిన కీర్తనలను జానపద బాణీలో పాడుతూ నృత్యం చేశారు. వీరు గుండ్రంగా తిరుగుతూ పైకి ఎగురుతూ నృత్యం చేయడం ఆకట్టుకుంది.
పలమనేరు కీలుగుర్రాలు
పలమనేరుకు చెందిన కళాకారుల కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో పొడుగు కాళ్లతో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుబ్రమణ్యస్వామివారి కావడి నృత్యం అద్భుతంగా సాగింది.అదేవిధంగా, బళ్లారి డ్రమ్స్, చెక్కభజనలు, వివిధ పౌరాణిక అంశాలతో రూపకాలు, కోలాటాలు, భరతనాట్యం, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర కళాకారుల స్థానిక జానపద కళారూపాలను ప్రదర్శించారు.