FireCrackers Blast : బాణసంచా పేలుడులో ముగ్గురి మృతి
FireCrackers Blast : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. తాడేపల్లి గూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కర్మాగారంలో పనిచేస్తున్న నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
FireCrackers Blast పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడులో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మాంసపు ముద్దలుగా మారిపోయారు. మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
ట్రెండింగ్ వార్తలు
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 80శాతం పైగా గాయాలపాలవడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామశివారులోని చెరువు వద్ద బాణసంచా కర్మాగారం ఉండటంతో ఘటనాస్థలికి ఫైరింజన్ చేరుకోలేకపోయింది. 300 మీటర్ల దూరంలోనే ఫైరింజన్ నిలిచిపోయింది.
కడియద్ద గ్రామంలోని రాజం చెరువు సమీపంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో తయారైన బాణాసంచాను వాహనంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు తొమ్మిది మంది కార్మికులు పనిచేశారు. రాత్రికి తయారైన బాణాసంచాను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో వంట చేయడానికి ఓ మహిళ ఇంటికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంది. మరో వ్యక్తి హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకోడానికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి వివరాలు తెలియలేదు. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యాళ్ల ప్రసాద్, అనంతపల్లి గ్రామానికి చెందిన సొలొమన్ రాజులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో యాళ్ల ప్రసాద్ ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు.
తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాల్లోని అనంతపల్లి, జగ్గన్నపేట, అల్లంపురం కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బాణాసంచా తయారీ కర్మగారాల్లో పనిచేస్తున్నారు. బాణా సంచా తయారీ చేస్తున్న పండూరి అన్నవరం పరారయ్యాడని పోలీసులు ప్రకటించారు. 2018లో ఈ కర్మాగారానికి లైసెన్స్ తీసుకున్నారు. 2023 వరకు లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఘటనా స్థలాన్ని ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, మంత్రి కొట్టు సత్యనారాయణ , డిఐజి పాలరాజు సందర్శించారు. బాణా సంచా తయారీ కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు బాణా సంచా పేలుడులో ముగ్గురు కార్మికులు చనిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరిణించిన వారి కుటుంబాలకు పది లక్షల రుపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.