ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో తీవ్ర విషాదం జరిగింది. శనివారం ఉదయం కరెంట్ షాక్ వల్ల ముగ్గురు చనిపోయారు. ఒకరినొకరు కాపాడుకోబోయి.. అలా ముగ్గురు మరణించారు. సలాది ప్రసాద్, తరవలి ముత్యావల్లి, సలాది వెంకట హేమవాణి కరెంట్ షాక్తో మృతిచెందారు. వీరు బెంజ్ సర్కిల్ ఏరియాలోని నారా చంద్రబాబునాయుడు కాలనీ సాయి టవర్స్లో నివాసం ఉంటున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సలాది ప్రసాద్ లారీ డ్రైవర్. అతని చెల్లెలు తరవలి ముత్యావల్లి. ఈ ఘటన గురించి తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో.. నారా చంద్రబాబునాయుడు కాలనీలో విషాదం నెలకొంది.
సాయి టవర్స్లో దంపతులు ప్రసాద్, హేమావాణి నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో.. భార్య హేమావాణికి కరెంటు షాక్ తగిలి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త ప్రసాద్ ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనూ ప్రమాదానికి గురయ్యాడు. వీరిద్దరిని చూసిన వారి బంధువు (ప్రసాద్ చెల్లెలు ముత్యావల్లి) కాపాడే ప్రయత్నం చేసింది. ఆమెకు కూడా షాక్ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. దీన్ని గమనించిన స్థానికులు.. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
కరెంట్ షాక్ తగిలినప్పుడు నేరుగా ముట్టుకోవద్దు. ముందుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. లేదా ప్లగ్ను తొలగించాలి. ఇది సాధ్యం కాకపోతే, బాధితుడిని విద్యుత్ వైర్ నుండి వేరు చేయడానికి ప్రయత్నించాలి. దీని కోసం పొడి కర్ర, ప్లాస్టిక్ లేదా రబ్బరు వంటి విద్యుత్ వాహకం కాని వస్తువును ఉపయోగించాలి. బాధితుడిని తాకవద్దు. బాధితుడి శ్వాస, హృదయ స్పందనను తనిఖీ చేయాలి. అవసరమైతే, సీపీఆర్ చేయాలి. సీపీఆర్ చేయడం తెలియకపోతే.. అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయాలి.
సంబంధిత కథనం