మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు-three day annual vasanthotsavams will be observed in tiruchanoor temple from may 11 to 13 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు

మే 11 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు - భక్తులకు టీటీడీ కీలక సూచనలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. మే 11 నుంచి 13వ తేదీ వరకు వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (TTD)

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు.. మే 13వ తేదీతో ముగుస్తాయి. ఈ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

  • వార్షిక వసంతోత్సవాల నేపథ్యంలో మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు.
  • భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
  • ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
  • వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
  • రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఈ వసంత్సోత్సవాల సందర్భంగా మే 6 మ‌రియు మే 10 నుండి 13వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు:

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు టీటీడీ వెల్లడించింది. ⁠మే 2, 9, 16, 23, 30వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ⁠ మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.