తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు.. మే 13వ తేదీతో ముగుస్తాయి. ఈ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ వసంత్సోత్సవాల సందర్భంగా మే 6 మరియు మే 10 నుండి 13వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు టీటీడీ వెల్లడించింది. మే 2, 9, 16, 23, 30వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.