AP SSC Exams: ఈ ఏడాది పది పరీక్షల్లో ఏడు సబ్జెక్టులు..-the state government has decided to conduct this years 10th class exams in ap with seven subjects ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Exams: ఈ ఏడాది పది పరీక్షల్లో ఏడు సబ్జెక్టులు..

AP SSC Exams: ఈ ఏడాది పది పరీక్షల్లో ఏడు సబ్జెక్టులు..

HT Telugu Desk HT Telugu
Published Aug 09, 2023 06:02 AM IST

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలను ఏడు సబ్జెక్టులతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స

AP SSC Exams: ఏపీలో 2023-24 విద్యా సంవత్సరానికి జరిగే పదో తరగతి పరీక్షల్లో ఏడు సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో జరిగిన పరీక్షల్లో ఆరు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానాన్ని అమలు చేయనున్నారు.

ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, బయాలజీ పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలోనిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను వివరించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపర‌తో నిర్వహించనున్నట్లు వివరించారు.

దీంతో పాటు ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఫస్ట్‌ లాంగ్వేజ్ ఒక్క దాంట్లోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.

తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు.

రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

ఉపాధ్యాయుల బదిలీలు…

గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ద్వారా అవసరమైన చోటుకు ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తారు. మొదట స్కూల్‌ కాంప్లెక్స్‌, మండలం, డివిజన్‌ ఇలా ప్రాధాన్య క్రమంలో ఈ ప్రక్రియను చేపడతారు.

మునిసిపల్ పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను దగ్గర్లోని ఇతర యాజమాన్య పాఠశాలల్లోనూ సర్దుబాటు చేస్తారు. అవసరం, అదనం ఆధారంగా ఈ సర్దుబాటు నిర్వహిస్తారు. మునిసిపల్ ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లుల గడువును పొడిగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు ఈ వారంలో జీతాలు ఇప్పిస్తామన్నారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 జాబ్‌ ఛార్ట్‌పై వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇటీవల బదిలీ పొంది రిలీవ్‌ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్‌ చేస్తామని మంత్రి తెలిపారు.

ఉపాధ్యాయులపై పనిభారం పెంచడం, సెక్షన్‌ పరిమాణాన్ని 50 శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని కొన్ని సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఎంఈఓలు ఇద్దరికీ సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టీయూ కోరింది. అంతర్‌జిల్లాల బదిలీలు, డీఎస్సీ-2003, పాత పింఛన్‌ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.

Whats_app_banner