Tirumala Tirupati Devasthanams Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో… పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది.
వేసవి సెలవులు ఉండటంతో అన్ని రాష్ట్రాల నుంచి శ్రీవారి భక్తులు దర్శనానకిి తరలివస్తున్నారు. త్వరలోనే పిల్లలకు సెలవులు కూడా ముగియనున్నాయి. దీంతో ఈలోపే తిరుమలకు వెళ్లేందుకు చాలా మంది భక్తులు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. తాజా పరిస్థితి చూస్తే…. అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయి ఉన్నాయి. కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవటంతో వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న (మే 24వ తేదీన) చూస్తే…. తిరుమల శ్రీవారిని 70,668 భక్తులు దర్శించుకున్నారు.38,036 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 3.64 కోట్లు హుండు కానుకలు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శిలాతోరణం వద్దకు భక్తులు బారులు తీరినట్లు పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు(శుక్ర, శని, ఆదివారం తేదీలు)వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సుల లేఖలు కూడా స్వీకరించబడవని స్పష్టం చేసింది.
శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 - 40 గంటల సమయం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే...బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చే భక్తుల సంఖ్య తిరుమలలో పెరిగిపోయింది.క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
మరోవైపు ఆగస్టు నెల కోటాకు సంబంధించి రూ.300 తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల టీటీడీ విడుదల చేసింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు www.ttdevasthanams.ap.gov.i వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు.
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి 8.40 గంటలకు ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు.
అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.