Liquor Margins: రెండు బ్రాండ్లకు ధర తగ్గించినట్టే తగ్గించి మళ్లీ పెంచేశారు, మిగిలిన బ్రాండ్లకు మార్జిన్‌ కూడాపెంపు..-the price of two liquor brands was reduced and then increased again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Margins: రెండు బ్రాండ్లకు ధర తగ్గించినట్టే తగ్గించి మళ్లీ పెంచేశారు, మిగిలిన బ్రాండ్లకు మార్జిన్‌ కూడాపెంపు..

Liquor Margins: రెండు బ్రాండ్లకు ధర తగ్గించినట్టే తగ్గించి మళ్లీ పెంచేశారు, మిగిలిన బ్రాండ్లకు మార్జిన్‌ కూడాపెంపు..

Sarath Chandra.B HT Telugu
Published Feb 12, 2025 04:00 AM IST

Liquor Margins: ఏపీలో నేడో రేపో మద్యం ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తోన్న మద్యం ప్రియుల ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లింది. లైసెన్స్‌దారులకు నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఖజానాకు చిల్లు పడకుండా మార్జిన్‌ పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ధరలు తగ్గుతాయని చెబుతూ వచ్చిన ఎక్సైజ్ శాఖ పిల్లి మొగ్గ వేసింది.

ఏపీలో మద్యం ధరల పెంపు, ఇక తగ్గింపు లేనట్టే...
ఏపీలో మద్యం ధరల పెంపు, ఇక తగ్గింపు లేనట్టే... (istockphoto)

Liquor Margins: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుతాయని ఎదురు చూస్తోన్న వారికి కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఇక ధరలు తగ్గే అవకాశం లేదని చెప్పకనే చెప్పేసింది. జగన్‌ బాటలోనే ఎనిమిది నెలలుగా మద్యం ధరల్ని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడ బాటిల్‌పై మరో రూ.10 అదనపు వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై మద్యం కొనుగోలు దారుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఐదేళ్లు మద్యం అమ్మకాల్లో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని విమర్శించిన వారు ఇప్పుడు ధరల్ని పెంచడాన్ని బహిరంగంగానే విమర‌్శిస్తున్నారు.

ఏపీలో మద్యం ధరలు తగ్గవని స్పష్టత వచ్చేసింది. మద్యం ధరలపై రిటైల్ మార్జిన్ సవరిస్తూ మంగళవారం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో బాటిల్‌ మీద రూ.10 అనే వివరణ ఎక్కడా ఇవ్వలేదు. అదనపు రిటైల్‌ వసూళ్లను మద్యం ధరల ఆధారంగా వసూలు చేసుకునేందుక మాత్రం అనుమతించారు. మద్యం బాటిళ్ల సైజు వారీగా ఎంత అదనంగా వసూలు చేసుకోవచ్చో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మార్పీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మద్యం ధరల విషయంలో ఎక్కడా పట్టికలు లేవు. గత ఏడాది అక్టోబర్‌ 16 నుంచి ప్రైవేట్‌ మద్యం దుకాణాల్లో విక్రయాలు జరుగుతున్నా ధరల పట్టికలు మాత్రం ఏర్పాటు చేయలేదు.

ప్రభుత్వ ఆదాయానికి డోకా లేదు…

మద్యం దుకాణాలకు 14 శాతం మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ మాత్రం గండి పడే అవకాశం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బాటిల్ పై రూ.10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మద్యం షాపుల కేటాయింపు నుండి బ్రాండ్ల పునరుద్దరణ వరకు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందన్నారు.

మద్యం పాలసీకి సంబందించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను అన్నింటినీ సరిదిద్దుతూ తమ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందించి అత్యంత పారదర్శకంగా అమలు చేయడం జరుగుచున్నదన్నారు. మద్యం షాపులకు ఏకంగా 90 వేల దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల మేర ఆధాయం వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించడం జరుగుచున్నదన్నారు.

బెల్టు షాపులపై పీడీ యాక్ట్…

ఎన్నికల కోడ్ ఉన్న ఆరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ షాపుల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయించడం జరిగిందని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారు భంగపడ్డారన్నారు.

రూ.99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, 12 రకాల పరీక్షలు నిర్వహించిన తదుపరే షాపులకు తరలిస్తున్నామన్నారు. ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా డిపోల నుండి వచ్చే ఇండెంట్ ఆధారంగా మాత్రమే మద్యం కేటాయింపులు చేస్తున్నామన్నారు. బెల్టు షాపుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉందని, ట్రాక్ అండ్ ట్రేస్ విధానంలో ప్రతి బాటిల్‌ని మానిటర్ చేస్తున్నామని చెప్పారు.

బెల్టు షాపులు నిర్వహిస్తూ పట్టుబడితే, మద్యం ఇచ్చిన షాపుకు తొలిసారి రూ.5లక్షల జరిమానా విధిస్తామని, మరోసారి పట్టుబడితే ఏకంగా లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో త్వరలోనే నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన మేరకు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం