Pithapuram Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు స్థాయికి అభివృద్ధి, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
Pithapuram Hospital: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 100పడకలను మంజూరు చేసింది.
ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Pithapuram Hospital: పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు స్థాయికి అభివృద్ధి చేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు.
దీనికోసం ప్రభుత్వం సోమవారం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిఠాపురం ఆస్పత్రి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది రానున్నారు.
తాజా సౌకర్యాలు ఇవే..
- ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వసతుల పెంపు కోసం రూ.38.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు.
- పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. అదనపు విభాగాలు రానున్నాయి.
- పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి-ముక్కు-గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు.
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలలలోపునే అమలు కావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యవసతులు కల్పన సాధ్యమవుతోంది. పిఠాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాలతోపాటు సమీపంలో పలు నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.