Tribal Woman Murder: ప్రేమించి పెళ్లి చేసుకుని.. విశాఖలో గిరిజన యువతి దారుణ హత్య
Tribal Woman Murder: ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానంతో అంత మొదించాడు. విశాఖపట్నంలో గిరిజన యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని ఆపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు.
Tribal Woman Murder: విశాఖపట్నం అచ్యుతాపురంలో గిరిజన మహిళ హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే అనుమానంతో హత్య చేశాడు. హత్య తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విశాఖ జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలేనికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (27) అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రక్తపు మడుగులో కనపించింది. ఇదే గదిలోని మరుగుదొడ్డిలో భర్త మాడే శ్రీనివాసకుమార్ గాయాలతో కనిపించారు. వీరు ఇద్దరూ ఉంటున్న గది నుంచి కేకలు వినిపించడంతో లాడ్జి సిబ్బంది చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ట్రెండింగ్ వార్తలు
పోలీసులు వచ్చి తలుపులు తీయించి చూడగా యువతి రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉంది. పోలీసులు రావడంతో గాయాలతో ఉన్న శ్రీనివాసకుమార్ మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. దాంతో తలుపు పగులగొట్టి బయటకు తీసుకొచ్చిన పోలీసులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సాంబ, కల్యాణి దంపతుల ఏకైక కుమార్తె మహాలక్ష్మి చదువుల్లో ముందుండేది. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసి రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తోంది.
గాజువాకలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మహాలక్ష్మీకి సీనియర్ అయిన శ్రీనివాసకుమార్తో పరిచయమై ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఆమె తల్లి దండ్రులకు ఇష్టం లేకపోవడంతో రహస్యంగా రిజిస్ట్రర్ ఆఫీసులో పెళ్లి చేసుకొంది. సోమవారం ఎలమంచిలిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైంది. ఆ తర్వాత అచ్యుతాపురం వచ్చింది. రోజూ మాట్లాడినట్లే భోజన సమయంలో తల్లి కళ్యాణితో మాట్లాడింది.
ఆ తర్వాత తల్లికి చెప్పకుండానే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో లాడ్జీకి వచ్చింది. శ్రీనివాసకుమార్ ఉదయం 10.38 నిమిషాలకు రెసిడెన్సీలోని 303 గదిలోకి ఒక్కడే వచ్చిన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇద్దరు మాట్లాడుకున్న ఇద్దరు తరవాత పెద్దగా కేకలు వేసుకున్నారు. వీరు ఉన్న గది నుంచి పెద్దపెద్ద శబ్దాలు రావడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి తలుపులు తియ్యమన్నా దుస్తులు మార్చుకుంటున్నామని వచ్చేస్తామని చెప్పి సిబ్బందిని శ్రీనివాస్ కుమార్ నమ్మించాడు.
అతని వ్యవహారంపై సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తరవాత గది తలుపులు తీసి మరుగుదొడ్డిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.
ప్రేమ పెళ్లి, ఆపై అనుమానం….
బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసకుమార్ తల్లి, ఆడపడుచులు మహాలక్ష్మీని పలుమార్లు తక్కువ కులం పేరుతో తమ కుమార్తెను వేధించేవారని, వీటిని భరించలేక ఆమె ఇంటికి వచ్చేసిందని మహాలక్ష్మి తల్లిదండ్రులు సాంబ, కళ్యాణి చెప్పారు.
విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించినా అతను కోర్టుకు వచ్చేవాడు కాదన్నారు. రాంబిల్లి మండలంలో విధులు నిర్వహించడానికి వెళ్లే సమయంలో ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడని, ఇంటికి వచ్చి చంపుతానని పలుమార్లు బెదిరించాడని ఆరోపించారు. కులంపేరుతో దూషించడం, వేధింపులు, చంపుతానని బెదిరించడంపై కూర్మన్నపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. పోలీసులు పట్టించుకొని ఉంటే మహాలక్ష్మి బతికే ఉండేదని కన్నీరుమున్నీరయ్యారు.
శ్రీనివాసకుమార్కి మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్నాడని, స్నేహితులతో సరదాగా మాట్లాడినా తట్టుకోలేని విధంగా ప్రవర్తించే వాడని ఆమెతో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తెలిపారు. ఆమె చాలా తెలివైందని ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదని సహోద్యోగులు చెప్పారు. రెండేళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్న మహలక్ష్మి హత్యకు గురికావడంపైకొప్పుగుండు పాలెం గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.