Thalliki Vandanam Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. శాసనమండలిలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ...."శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్/మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం" అని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకూ రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల హామీల్లో ప్రకటించాయి. పథకాల అమల్లో జాప్యంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
"అధికారంలోకి రాగానే పింఛన్ పెంచాం. ఏడాదికి ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చెత్తపన్ను, ల్యాండ్టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని కేంద్ర నిధులను 9 నెలల్లో తీసుకొచ్చాం. ఐదేళ్లలో రాష్ట్రానికి వైసీపీ చేసిందేంటి? మాట తప్పం మడమ తిప్పం అన్నవారు అమరావతిపై మాట తప్పారు. పోలీసుల బూటుకాళ్లతో మహిళలను తన్నించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం పారిశ్రామికంగా నష్టపోయింది. కంపెనీలు ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు"- మంత్రి లోకేశ్
2014-19 మధ్య ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇవన్నీ వైసీపీ మంత్రి గతంలో ఈ సభ సాక్షిగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇక సంక్షేమంలో కూడా బాగా చేశామన్నారు. రూ.200 పెన్షన్ ని రూ.2 వేలు చేశామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పసుపు కుంకుమ కింద ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేశామన్నారు. ఆదరణ పథకం అమలుచేశామన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం చేసి చూపించామన్నారు.
"గత ఐదేళ్లలో గన్ పాయింట్లో ఆస్తులు లాక్కున్నారు. ఏకంగా కాకినాడ పోర్టును కూడా లాక్కున్నారు. రాష్ట్రంలో ఓ మాఫియాను నడిపించారు. దేవాలయంలా భావించే టీడీపీ ఆఫీస్పై దాడి చేశారు. పీపీఏ కిట్లు అడిగినందుకు డా.సుధాకర్ ను పిచ్చివాడిని చేశారు. సోదరిని వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే.. అమర్నాథ్గౌడ్ను పెట్రోల్ పోసి తగలబెట్టారు. కల్తీ మద్యంపై మాట్లాడితే పుంగనూరులో ఓంప్రకాష్ను చంపేశారు. అబ్దుల్ సలాంను ఆత్మహత్య చేసుకునేలా భయపెట్టారు. రఘురామకృష్ణంరాజును ఎలా కొట్టారో ప్రజలంతా చూశారు. విధ్వంసం నుంచి బయటపడేందుకు అహర్నిశలు కష్ట పడాల్సి వస్తోంది" -మంత్రి లోకేశ్
మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తామని సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం స్కీమ్ అమలుచేస్తామన్నారు.
సంబంధిత కథనం