AP TS Weather Upadates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు
AP TS Weather Upadates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు పెరుగనున్నాయి. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణం కాస్త చల్లబడింది. రానున్న మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP TS Weather Upadates: తెలంగాణలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
రాబోయే మూడు రోజులు గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ప్రతాపాన్ని చూపించాడు. ఉదయం 7 గంటల నుంచే వేడి గాలులు మొదలయ్యాయి. ఎండ, వేడి గాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్ర, శనివారాల్లో ఎండల తీవ్రత పెరగనున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
అటు ఆంధ్రాలో కూడా రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శుక్రవారం కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
శనివారం 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 46°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శనివారం విజయనగరం,మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వమణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎండ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అకాల వర్షాలు, పిడుగులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.