TG Mla Letters: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
TG Mla Letters: తెలంగాణ ప్రజా ప్రతినిధుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారు.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
TG Mla Letters: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులను కూాడా అనుమతించాలనే డిమాండ్ ఎట్టకేలకు ఫలించింది. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే క్రమంలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ను కూడా తెలంగాణ ప్రజా ప్రతినిధులు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధులకు గతంలో ఉన్న సదుపాయాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ లేఖకు స్పందనగా చంద్రబాబు సోమవారం రిప్లై లేఖ రాశారు.
తెలుగుజాతి సత్సంబంధాలను కొనసాగించడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యం, సులభ దర్శనం కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వారంలో రెండు రోజుల్లో సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ దర్శనం (రూ.500 టికెట్) కోసం రెండు లేఖలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్) కోసం రెండు లేఖల చొప్పున అనుమతిస్తామని తెలిపారు.
ఒక్కో లేఖలో ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయవచ్చని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అమోదించడంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వేంకటేశ్వరస్వామి దర్శనం మరింత సులభమవుతుందని ప్రసాద్కుమార్ అన్నారు. తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా కొండా సురేఖ అభివర్ణించారు.
సీఎంతో టీటీడీ ఛైర్మన్ భేటీ…
సోమవారం ముఖ్యమంత్రితో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ అయ్యారు. ధర్మ కర్తల మండలి తీసుకొంటున్న నిర్ణయాలపై ఛైర్మన్తో పాటు పాలకమండలి సభ్యులను సీఎం అభినందించారు.
తిరుమలలో భక్తులు గంటల తరబడి దర్శనం కోసం క్యూ లైన్ లోను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోవేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరితగతిన భక్తులకు దర్శనం కల్పించాలని ఆలోచనలతో ఉన్నట్టు ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్ నాయుడు వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సీయం సానుకూలంగా స్పందించారు. అనుభవం కలిగిన ముగ్గురితో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని సీఎంను ఛైర్మన్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
సిమ్స్ ఆస్పత్రి కి ప్రతి ఏటా 100 కోట్లు నష్టం వస్తోందని , ఆరోగ్య శ్రీ నుంచి 80 కోట్లు రావాల్పి ఉందని చైర్మన్ వినతి పత్రం అందించడంతో త్వరలో నిధులు విడుదల చేస్తానని హమీ ఇచ్చారు.చిన్నపిల్లల ఆస్పత్రి,సిమ్స్ లో నూతన భవనాలు భవనాల నిర్మాణంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నూతన భవనాల నిర్మాణాలను ఆపాలని భావిస్తున్నట్టు వివరించారు. పాలకమండలి నిర్ణయం మేర కు నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
తిరుమల ఆలయంలో భక్తులు త్రోపులాటకు గురవుతున్నారని భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ పెట్టాలని పాలకమండలి నిర్ణయాన్నిముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్వీ బిసి ఛానల్ కు త్వరలోనే చైర్మన్ నియామకం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ఛైర్మన్కు వివరించారు.
అన్యమతస్తుల విషయంలో పాలకమండలి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని సీయం సూచించారు. ఎస్వీబీసీ లో ఉద్యోగుల ఫిర్యాదు ల మేరకు ప్రక్షాళన చేయాలని సీఎంను చైర్మన్ కోరడంతో అందుకు అమోదం తెలిపారు. గత ప్రభుత్వహయాంలో డిప్యూటేషన్ పై వచ్చిన ఎనిమిది మంది అధికారులను బదిలీ చేయడానికి సీఎం అనుమతిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.