విజయవాడలో వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆలస్యం కానున్న తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల-telangana cm revanth reddy in vijayawada telangana 10th class results release to be delayed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  విజయవాడలో వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆలస్యం కానున్న తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల

విజయవాడలో వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆలస్యం కానున్న తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విజయవాడలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడలో రేవంత్‌రెడ్డికి పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

దేవినేని ఉమా కుమారుడి వివాహంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, నారా లోకేష్‌

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విజయవాడలో జరిగిన వివాహానికి హజరయ్యారు. ఉన్నారు. కంకిపాడులో జరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి సీఎం హాజరయ్యారు. నగర శివార్లలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడు వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు , బీసీ జనార్థన్ రెడ్డి స్వాగతం పలికారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా - అనుపమ దంపతుల కుమారుడు నిహార్, అనుమోలు రవికుమార్ - నీరజ దంపతుల ఏకైక కుమార్తె శ్రీ సాయి నర్మద ల వివాహం బుధవారం కంకిపాడులోని కళ్యాణ మండపంలో జరిగింది.

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడి కుమారుడి వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కంకిపాడులోని ఆయానా కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని మంత్రి లోకేష్, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో పది ఫలితాలు ఆలస్యం..

తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరు కావడంతో తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల ఆలస్యమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రవీంద్ర భారతిలో ఫలితాల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు రావడంతో ఉదయం 11గంటలకే హాల్ నిండిపోయింది. నిర్ణీత సమయానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఏటా పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ అధికారులు, మంత్రులు విడుదల చేసేవారు. ఈ ఏడాది ముఖ్యమంత్రి స్వయంగా ఫలితాలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఏపీలో అలా…

ఏపీలో ఇంటర్‌, పదో తరగతి పరీక్షా ఫలితాలకు కార్యక్రమాలను నిర్వహించే విధానానికి స్వస్తి పలికారు. ఈ ఏడాది నుంచి ఇంటర్, టెన్త్‌ ఫలితాలను వాట్సాప్‌లోనే విడుదల చేశారు. అధికారిక సమాచారాన్ని ఎక్స్‌లో విడుదల చేశారు. ఫలితాల విడుదల ఏర్పాట్ల కోసం వృధా ఖర్చును అరికట్టేందుకు సోసల్‌ మీడియాలోనే ఫలితాలను విడుదల చేస్తున్నట్టు నారా లోకేష్‌ పేర్కొన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం