ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోలులోని పద్మ టవర్స్ లోని తన ఆఫీసులో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ముసుగులతో వచ్చి ఆయనపై కత్తులతో దాడి చేశారు. దుండగులు బిహార్ గ్యాంగ్ గా తెలుస్తోంది. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒంగోలుకు చెందిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఒంగోలులో మినీ బైపాస్లోని పద్మ టవర్స్ లోని తన కార్యాలయంలో సాయంత్రం 7.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముసుగుల్లో వచ్చి వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేశారు. కత్తులతో తీవ్రంగా దాడి చేయడంతో ఆయన రక్తపు మడుగులో పడిపోయారు.
వీరయ్య చౌదరిని అతని కార్యాలయ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మృతి చెందారు. ఒంగోలు టీడీపీలో కీలక వ్యక్తి అయిన వీరయ్య చౌదరి...సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు. ఆయన లిక్కర్ వ్యాపారంలో కూడా ఉన్నారు. జిల్లాలోని పలు చోట్ల మద్యం షాపుల నిర్వహణలో సిండికేట్గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
మద్యం సిండికేట్ తో పాటు వీరయ్య చౌదరికి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ఆర్థికంగా వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా ఆయనపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను ప్రశ్నిస్తున్నారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ హటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ కీలక నేత ఒంగోలు నడిబొడ్డులో దారుణ హత్యకు కావడం కలకలం రేపుతోంది.
"సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త నన్ను షాక్ కు గురిచేసింది. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది" - మంత్రి లోకేశ్
సంబంధిత కథనం