జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు.. లబ్దిదారులకు ఇకపై ఒకేసారి దీపం2 సబ్సిడీ బదిలీ..-surprise inspections anytime after june 12 cm chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు.. లబ్దిదారులకు ఇకపై ఒకేసారి దీపం2 సబ్సిడీ బదిలీ..

జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు.. లబ్దిదారులకు ఇకపై ఒకేసారి దీపం2 సబ్సిడీ బదిలీ..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో ప్రజలకు అందించే సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందేనని, జూన్‌ 12తో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

జూన్ 12 తర్వాత ఏపీలో ఆకస్మిక తనిఖీలు

ఏపీలో జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతివారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజలనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షించిన సీఎం... రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు.

సంబంధిత శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సిఎస్, సిఎంవో సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని అన్ని శాఖల్లో ప్రభుత్వ పని తీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో ఇప్పటికే మార్పు వచ్చిందని... ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందన్నారు.

ఒకేసారి దీపం సబ్సిడీ బదిలీ…

దీపం 2 పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని సిఎం అన్నారు. లబ్దిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు... ప్రభుత్వం దీపం 2 పథకంలో భాగంగా మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది. దీపం పథకం లబ్దిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో గాని ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రేషన్ సరుకుల పంపిణీపై అభిప్రాయాలు

ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా... అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యతపై ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా... అనే అంశంలో 62 శాతం మంది లేదు అని చెప్పారు. పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని.... నేరుగా వారి ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని... ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సిఎం అన్నారు. బస్స్టాండ్‌లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని సిఎం అన్నారు.

తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వెల్లడించారు. ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి... ఇంటి నంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారు. గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సిఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి... కంపోస్ట్ తయారీ చేపడతామని సిఎం అన్నారు.

ప్రభుత్వ సేవల్లో డాటా అనలటిక్స్ కీలకం

ప్రభుత్వ సేవల విషయంలో డాటా అనలటిక్స్‌ కీలకమని సీఎం అన్నారు. డాటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల తమ పనితీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. ఒక ప్రభుత్వ పథకం, లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న సందర్భంలో వాటికి కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డాటాపై అనలటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని సిఎం సూచించారు.

వాట్సాప్ గవర్నెన్స్‌లో జూన్ నాటికి 500 సేవలు

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 325 సేవలు అందుతున్నాయి. మన మిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 45 లక్షల మంది ఈ సేవలను విజయవంతంగా వినియోగించుకున్నారని జూన్ 12వ తేదీ నాటికి 500 సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం