డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా డిమోషన్‌...! కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అధికారిపై చర్యలు-supreme court says defiance of court orders attacks rule of law demotes ap govt official ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా డిమోషన్‌...! కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అధికారిపై చర్యలు

డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా డిమోషన్‌...! కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అధికారిపై చర్యలు

కోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా పరిగణించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించిన ఓ కేసులో తాతా మోహన్‌రావు అనే అధికారిపై చర్యలకు ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు (AFP)

ఏపీ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ఓ అధికారిపై సుప్రీంకోర్టు చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమంటే ప్రజాస్వామ్యానికి పునాది అయిన న్యాయవ్యవస్థపై దాడి చేయడం లాంటిదేనని వ్యాఖ్యానించింది.

తాతా మోహన్‌రావు అనే అధికారి 2014లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించింది. ఈ మేరకు ఆయనపై హైకోర్టు చర్యలకు ఆదేశించింది. రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వలు ఇచ్చింది.

2015లో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను తాతా మోహన్‌రావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు…. కోర్టు ధిక్కరణ చర్యలను సీరియస్ గా పరిగణించింది. డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న తాతా మోహన్‌రావుని తిరిగి తహసీల్దార్ గా నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

ప్రతి అధికారి కట్టుబడి ఉండాల్సిందే - సుప్రీం ధర్మాసనం

"కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించినా సహించే ప్రసక్తే ఉండదు. ఇదే సందేశం దేశమంతటా వెళ్లాలని మేం కోరుకుంటున్నాం. సదరు అధికారికి రూ.లక్ష జరిమానా విధిస్తూ చట్టానికి ఎవరూ అతీతులు కాదనే సందేశం అందరికీ వెళ్లాలి. ఏ కోర్టు అయినా ఆదేశాలు జారీ చేసినప్పుడు…. హోదాతో సంబంధం లేకుండా ప్రతి అధికారి ఆ ఉత్తర్వులను గౌరవించాలి. దానిని పాటించడానికి కట్టుబడి ఉండాలి" అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం అభిప్రాయపడింది.

ఏపీ హైకోర్టు ఆదేశాలు…

గుడిసెల తొలగింపు విషయంలో 2013 డిసెంబర్ 11న నాటికి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 2014 జనవరిలో గుంటూరు జిల్లాలో అప్పటి తహసీల్దార్ గా ఉన్న తాతా మోహన్‌రావు బలవంతంగా తొలగించారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది.

గుడిసెల తొలగింపు కేసులో హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా, పూర్తిగా ఉల్లంఘించినందుకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఈ తీర్పుపై సదరు అధికారి అప్పీల్ కు వెళ్లగా… ఈ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ క్రమంలోనే… సదరు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో అధికారిని దోషిగా నిర్ధారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ధృువీకరించింది. అయితే హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. పిటిషనర్ సర్వీసులో ఒక స్థాయిని కుదించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించామని పిటిషనర్(అధికారి) తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాత్రికి రాత్రే గుడిసెలు కట్టుకున్న వారిని మాత్రమే ఖాళీ చేయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ ను 48 గంటల పాటు జైలుకు పంపిస్తే సంబంధిత సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించి…. అతని కుటుంబంపై ప్రభావం పడుతుందని న్యాయవాది తెలిపారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ… గుడిసెవాసుల నిర్మాణాలను కూల్చివేసి, వారి వస్తువులతో సహా వాటిని రోడ్లపై పడేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సదరు అధికారిని తిరిగి తహసీల్దార్ గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని నాలుగు వారాల్లోగా జమ చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు శిక్షగా డిమోషన్ ను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని సుప్రీంకోర్టు గతంలో అధికారిని ప్రశ్నించింది. జైలు శిక్ష తప్పించుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తగ్గి తహసీల్దార్‌ పదవి చేపట్టడానికి అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించింది. అయితే పిటిషనర్‌ అంగీకరించకపోవడంతో తుది తీర్పు సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఆదేశించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.