ఏపీలో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అన్ని విషయాలను బయటికి లాగేందుకు ‘సిట్’ విచారణను వేగవంతం చేస్తోంద. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా… మరికొందరిని విచారించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పలువురు నిందితులు ముందుస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారికి అక్కడ ఎదురుదెబ్బ తగిలిగింది.
ఏపీ లిక్కర్ కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వీరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వీరికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.కేసు విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది.
లిక్కర్ కేసు తెరపైకి రాగానే… ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు కూడా ముందుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించారు. అయితే అప్పటికే ఈ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని ఆదేశాలిచ్చింది.
సుప్రీం ఆదేశాలతో ఈ ముగ్గురు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ పై మే 7వ తేదీన విచారణ జరిగింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే నిందితులు… సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు తమ పిటిషన్లను తిరస్కరించిందని… తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. హైకోర్టులో పెండింగ్లో ఉండగానే సుప్రీంలో దాఖలైన ఈ పిటిషన్ నిరర్ధకమైందని వాదించారు. నిందితులు గతంలో వేసిన పిటిషన్ కాకుండా కొత్తగా పిటిషన్ వేసుకోవాలని… అప్పటి వరకు దీనిని అమమతించవద్దని కోరారు. రోహత్గీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం… వీరి పిటిషన్ ను అనుమతించేందుకు నిరాకరించింది.
నిందితులో గతంలో వేసిన పిటిషన్ను సవరించి లేదా మరో పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. అయితే మే 13 వరకు తమను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇందుకు కూడా మరో పిటిషన్ వేసుకోవాలని సూచిస్తూ…. ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
సుప్రీంకోర్టులో ముగ్గురు నిందితులకు ఎదురుదెబ్బ తగలటంతో…. మరోవైపు సిట్ రంగంలోకి దిగింది.ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు వేట మొదలు పెట్టింది. వారికి సంబంధించిన పలుచోట్ల సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.
మే 13వ తేదీ నాటికి విచారణ వాయిదా పడటంతో… ఈ ముగ్గురిని సిట్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే… ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా… కస్టడీలోకి తీసుకొని సిట్ విచారిస్తోంది. లిక్కర్ కేసులో ఏ1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం