అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువతి దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో యువతి-student from guntur killed in road accident held texas of usa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువతి దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో యువతి

అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువతి దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో యువతి

Sarath Chandra.B HT Telugu

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో మృతి చెందింది. బాధితురాలిని గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన యువతిగా గుర్తించారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుంటూరు యువతి దీప్తి

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన వంగవోలు దీప్తి (23) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు.

గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైనులో నివసించే దీప్తి టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నారు. మరో నెల రోజుల్లో ఆమె కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగం స్థిరపడనుంది.

ఈ నెల 12వ తేదీన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయమైంది. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయపడింది.

దీప్తి, స్నిగ్ధలు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తోటి విద్యార్ధులుఆమె తండ్రి హనుమంతరావుకు సమాచారం అందించారు. సాయం కోసం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అమెరికా పర్యటనలో ఉన్న పెమ్మసానికి యువతి సమాచారం తెలియజేశారు.

దీంతో ఎంపీ చంద్రశేఖర్ తన సన్నిహితుల ద్వారా దీప్తికి మెరుగైన చికిత్స అందించేందుకు చొరవ తీసుకున్నారు.క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించి 80 వేల డాలర్ల వరకు చికిత్సకు వినియోగించారు. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 15న దీప్తి ప్రాణాలు విడిచింది.

దీంతో అమెరికా నుంచి మృతదేహాన్ని గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉందని ఎంపీ చంద్రశేఖర్‌ సోదరుడు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు.

చెదిరిన కలలు…

దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న అక్క దీప్తితో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పింది. కోర్సు పూర్తవుతున్నందున గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి తమను అమెరికా రావాలని కోరిందనిఆ ఏర్పాట్లలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిందని దీప్తి తండ్రి హనుమంతరావు విలపించాడు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం