విశాఖపట్నంలో తీవ్ర విషాదం.. కాలేజీ భ‌వ‌నం పైనుంచి దూకిన విద్యార్థి.. అక్క‌డిక‌క్క‌డే మృతి-student commits suicide by jumping from college building in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖపట్నంలో తీవ్ర విషాదం.. కాలేజీ భ‌వ‌నం పైనుంచి దూకిన విద్యార్థి.. అక్క‌డిక‌క్క‌డే మృతి

విశాఖపట్నంలో తీవ్ర విషాదం.. కాలేజీ భ‌వ‌నం పైనుంచి దూకిన విద్యార్థి.. అక్క‌డిక‌క్క‌డే మృతి

HT Telugu Desk HT Telugu

ఆ విద్యార్థి పరీక్ష హాలులో స్లిప్పులతో పట్టుబడ్డాడు. స్టాఫ్ అతన్ని బయటకు పంపారు. ప్రాధేయపడినా ఫలితం లేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి మండ‌లం త‌గ‌ర‌పువ‌ల‌స ప‌రిధిలోని సంగివ‌ల‌స ఎన్ఆర్ఐ మెడిక‌ల్ కాలేజీలో జరిగింది.

ఘటనా స్థలంలో పోలీసులు, విద్యార్థులు

ఈ విషాద ఘ‌ట‌న గురించి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. విజ‌య‌వాడ‌కు చెందిన రాజేశ్వ‌ర‌రావు కుమారుడు ప్ర‌ణీత్ శిరం (24). 2019లో ఎన్ఆర్ఐ మెడిక‌ల్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాడు. క‌రోనా స‌మ‌యంలో త‌లెత్తిన కొన్ని ఇబ్బందులు నేప‌థ్యంలో చ‌దువులో కాస్తా వెనుక‌బ‌డ్డాడు. దీంతో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ వ‌చ్చాడు. ఇప్ప‌టికే ప్ర‌ణీత్‌తో చేరిన వారంద‌రూ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు.

ఎలాగైనా గట్టెక్కాలని..

బ్యాక్‌లాగ్స్ ఉండ‌టంతో ప్ర‌ణీత్ ఎంబీబీఎస్ పూర్తి చేయ‌లేక‌పోయాడు. ఇప్పుడు ప్ర‌ణీత్ ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ పార్ట్‌-2 చ‌దువుతున్నాడు. గ‌త కొద్ది రోజులుగా స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ణీత్ ఆ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాస్తున్నాడు. ఈసారి అయినా ఎలాగైన గ‌ట్టెక్కాల‌నుకున్నాడు. శ‌నివారం జ‌రిగిన గైనిక్‌-1 ప‌రీక్ష‌కు స్లిప్పులు తీసుకెళ్లి రాస్తుండ‌గా.. ఇన్విజిలేట‌రుకు ప‌ట్టుప‌డ్డాడు. ఇన్విజిలేట‌ర్ ప్ర‌ణీత్ ఓఎంఆర్ షీట్‌ను తీసుకుని చీఫ్ ఎగ్జామిన‌ర్ శ్రీ‌ధ‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు.

నాలుగో అంతస్తు నుంచి..

ప్ర‌ణీత్ ఎంత ప్రాధేయ‌ప‌డినా ప‌రీక్ష రాసేందుకు వారు అంగీక‌రించ‌లేదు. ప‌రీక్ష పూర్తి అయ్యేదాక ప్ర‌ణీత్‌ను బ‌య‌ట‌కు పంప‌లేదు. దీంతో ప‌రీక్ష‌హాలు ప‌రిస‌రాల్లోనే మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ఉన్నాడు. ప‌రీక్ష రాసి విద్యార్థులు బ‌య‌టికి వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌ణీత్ ఎమ‌ర్జెన్సీ ద్వారం వైపు ప‌రుగులు తీశాడు. కాలేజీ భ‌వ‌నం నాలుగో అంత‌స్తుకు వెళ్లి అక్క‌డి నుంచి దూకి.. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. కాలేజీ విద్యార్థులు, యాజ‌మాన్యం, అధ్య‌ాప‌కులు అక్క‌డి చేరుకుని.. మృతదేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు.

విద్యార్థుల ఆందోళన..

త‌ల్లిదండ్రులు విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరుతూ.. వైజాగ్‌లో ఉన్న త‌న స్నేహితులు, బంధువుల‌కు స‌మాచారం అందించారు. వారంతా కాలేజీ వ‌ద్ద‌కు చేరుకున్నారు. యాజ‌మాన్యం వేధింపుల వ‌ల్లే ప్ర‌ణీత్ మృతి చెందాడ‌ని తోటి విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. కాలేజీ యాజ‌మాన్యానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. స‌మాచారం అందుకున్న విశాఖ నార్త్ ఏసీపీ అప్ప‌ల‌రాజు, భీమిలి సీఐ శ్రీ‌ధ‌ర్ పోలీసు సిబ్బందితో అక్క‌డికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు శ‌నివారం రాత్రి కాలేజీకి చేరుకుని మృతదేహాన్ని ప‌రిశీలించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు. కాలేజీ డీన్ డాక్ట‌ర్ సుధాక‌ర్ మాట్లాడుతూ.. విద్యార్థిపై ఎటువంటి వేధింపులకు పాల్ప‌డ‌లేదని, కాపీయింగ్‌కు పాల్ప‌డ‌ుతూ ప‌ట్టుప‌డ్డాడ‌ని వివరించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)