TTD Online Tickets: నేడు శ్రీవాణి టిక్కెట్ల ఆన్లైన్ కోటా జారీ…
TTD Online Tickets: శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ కోటా నేడు విడుదల కానున్నాయి. జూన్ నెల ఆన్లైన్ కోటాను నేడు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.
TTD Online Tickets: శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా నేడు విడుదల కానున్నాయి. శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు
మార్చి 23న శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.
జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి 24న ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు....
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టిక్కెట్లు కూడా 24వ తేదీన విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ వర్గాలు కోరాయి.
ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.
శల్య తంత్ర విభాగము, ద్రవ్య గుణ, రసశాస్త్ర సిద్ధాంత, పంచగవ్య చికిత్స పరిశోధనా కేంద్రం, చిన్నపిల్లల వార్డ్, లిచ్ థెరఫీ గది, కాయ చికిత్స వార్డు, పంచకర్మ వార్డు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, డ్రెస్సింగ్ రూమ్, క్లీనికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రక్త పరీక్ష కేంద్రం, ఎక్సరే విభాగాలను జేఈఓ పరిశీలించారు.
వివిధ విభాగాలలో అవసరమైన ఫర్నీచర్ ,ఫ్లోరింగ్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపిడి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు.
టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదులు, మ్యూజియం, గ్రంథాలయం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విద్యార్ధినుల హాస్టల్ భవనంలోని గదులను, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్ధినులకు అందిస్తున్న వసతి, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
శిల్ప కళాశాల ప్రాంగణంలో ఎంపోరియం
శిల్పకళాశాలలో ఉన్న ఉత్పత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎంపోరియం ఏర్పాటు చేయాలని జేఈఓ సూచించారు. ఇందుకోసం కళాశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. ఎంపోరియం ఏర్పాటు చేయడం వలన నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తారని చెప్పారు. ఒరిస్సా, కృష్ణా జిల్లా పెడన ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందిన విద్యార్థులను ఆమె అభినందించారు అనంతరం విద్యార్థులు రూపొందించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.