Shar Suicides : శ్రీహరికోటలో ఆత్మహత్యల కలకలం....
Shar Suicides శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో భద్రతా సిబ్బంది వరుస ఆత్మహత్యలు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకోవడంతో సహచరులు హతాశులయ్యారు. గంటల వ్యవధిలోనే సీఐఎస్ఎఫ్ జవాన్, ఎస్సైలు వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Shar Suicides తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మండలంలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు.ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాస్మాండ్ జిల్లా శంకర గ్రామానికి చెందిన చింతామణి 2021లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. శిక్షణానంతరం శ్రీహరికోటలోని షార్ యూనిట్లో విధుల్లో చేరారు. ఇటీవల నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవుపై సొంతూరుకు వెళ్లిన చింతామణి ఈ నెల 10న విధుల్లోకి తిరిగి వచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
షార్లోని పీసీఎంసీ రాడార్-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట షిఫ్ట్కు హాజరయ్యారు. రాత్రి 7.30 గంటలకు సెట్లో కంట్రోల్ రూమ్తో మాట్లాడి ఎలాంటి ఘటనలు లేవని సమాచారమిచ్చారు. క్విక్ రియాక్షన్ టీం విభాగం రాత్రి 8.30 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తూ చెట్టుకు వేలాడుతున్న చింతామణి మృతదేహాన్ని గుర్తించారు.
చింతామణికి తల్లిదండ్రులు లేరు. ఐదు నెలల క్రితం ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ వెంటనే యువతి తండ్రి చనిపోవడంతో పెళ్లి వాయిదా పడింది. నెల రోజుల క్రితం చింతామణి సోదరుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. తోడబుట్టిన సోదరుడి కోసం సంపాదన మొత్తం ఖర్చు చేసినా కోలుకునే పరిస్థితులు కనిపించక పోవడంతో మానసికంగా కుంగిపోయాడు.
సెలవులు పూర్తి కావడంతో తమ్ముడి సంరక్షణ బంధువులకు అప్పగించి ఇటీవల విధుల్లో చేరాడు. నెల రోజులకు పైగా తమ్ముడు కోమాలో ఉండటం, వైద్యానికి బాగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మానసిక సంఘర్షణతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనపై సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారుు.
తుపాకీతో కాల్చుకుని ఎస్.ఐ ఆత్మహత్య…..
చింతామణి ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి షార్ మొదటి గేటువద్ద కంట్రోల్ రూమ్లో సి-షిఫ్ట్లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు విధుల్లో ఉండాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్సింగ్ తన వద్దనున్న పిస్టల్తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తుపాకీ పేలిన శబ్దంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న సహచులు ఘటనా స్థలికి చేరుకునేసరికి వికాస్సింగ్ రక్తపు మడుగులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ సింగ్ కొంత కాలంగా షార్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. గంటల వ్యవధిలో ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడానికి విధుల్లో ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల వేధింపులు కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
టాపిక్