ప్రకృతి రమణీయత, నదీ ప్రవాహం, ఆధ్యాత్మిక వైభవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెట్టింది పేరు. ఆ వైభవానికి పూర్వపు కళ తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు ప్రధాన, పంచారామ క్షేత్రాలను యాత్రికులు సందర్శించేలా.. ప్రతి శనివారం ఆధ్యాత్మిక యాత్రకు అధికారులు నిర్ణయించారు.
ఈ యాత్ర ప్రతి శనివారం రాజమహేంద్రవరం ప్రారంభం అవుతుంది. గోదావరి గట్టుపై ఉన్న పర్యాటక శాఖ ఐఆర్వో కార్యాలయం వద్ద ఉదయం 6 గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి నేరుగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ దర్శనం పూర్తైన తరువాత అన్నవరం, ఆ తరువాత పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్తుంది. అక్కడి నుంచి కుక్కుటేశ్వరస్వామి ఆలయాల దర్శనానికి తీసుకెళ్తుంది. ఆ తరువాత పంచారామ క్షేత్రం సామర్లకోట భీమేశ్వర ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ దర్శన అనంతరం అన్న ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు.
ఆ తరువాత డైరెక్ట్గా ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి దర్శనానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత నేరుగా రాత్రి 7 గంటలకు రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద గోదావరి హారతి దర్శనంతో యాత్ర ముగియనుంది. 18 మంది ప్రయాణించేలా బస్సులతో యాత్రను మొదలు పెడతారు. భక్తుల రద్దీ ఆధారంగా ఈ యాత్రను ఆదివారం కూడా కొనసాగించే అవకాశం ఉంది.
టిక్కెట్టు ధరను రెండు రకాలుగా విభజించారు. ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.1,000 ఉంటుంది. అలాగే 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకు రూ.800 ఉంటుంది. ఈ యాత్ర తూర్పు గోదావరి జిల్లాతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రధాన క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునే సౌలభ్యంగా ఉంటుంది. భక్తుల రద్దీ ఆధారంగా సేవలను మరింత విస్తృతం చేస్తామని.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)