Sankranti Special Trains : సంక్రాంతి ప్రయాణ కష్టాలకు చెక్.. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే-special trains across telugu states ahead of sankranti festival ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Special Trains : సంక్రాంతి ప్రయాణ కష్టాలకు చెక్.. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

Sankranti Special Trains : సంక్రాంతి ప్రయాణ కష్టాలకు చెక్.. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే

Sankranti Special Trains : సంక్రాంతి పండగకు రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రద్దీని తగ్గించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో సంక్రాంతి ప్రయాణ కష్టాలు కొంతమేర తగ్గనున్నాయి. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ. ముఖ్యంగా ఏపీలో ఈ పండగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఉద్యోగం, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లినవారు.. సంక్రాంతికి సొంతూరుకు వస్తారు. రాకపోకలకు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో రైలు టికెట్లకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే దాదాపు అన్నిట్రైన్లలో టికెట్లు అయిపోయాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణికుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే.. ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

విశాఖ, చెన్నై మధ్య..

విశాఖపట్నం- చెన్నై మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 08557, 08558 నంబర్లతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. 2025 మార్చి 1వ తేదీ వరకు ఈ ట్రైన్ ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఎగ్మోర్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరుతుంది. 2025 మార్చి 2వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్టింగ్ ఉంది.

సంబల్‌పూర్, ఈరోడ్ మధ్య..

సంబల్‌పూర్- ఈరోడ్ మధ్య స్పెషల్ ట్రైన్‌ను నడపనున్నారు. 08311, 08322 నంబర్లతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈనెల 11 నుంచి 2025 మార్చి 7వ తేదీ వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతీ బుధ, గురువారాల్లో రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు ఏపీలోని పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్, విశాఖ మధ్య..

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 07097, 07098 నంబర్లతో ఈ ట్రైన్ రాకపోకలు సాగించనుంది. ప్రతీ ఆది, సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. ప్రతీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఇది సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విశాఖ నుంచి సోమవారాల్లో సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌కు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

భువనేశ్వర్, యశ్వంతాపూర్ మధ్య..

భువనేశ్వర్- యశ్వంతాపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. 02811, 02812 నంబర్లతో ఈ రైలు రాకపోకలు సాగించనుంది. 2025 ఫిబ్రవరి 24 వరకు ఈ రైలు ప్రతీ సోమ, మంగళవారాల్లో రాకపోకలు సాగించనుంది. సోమవారం తెల్లవారుజామున 12.15 గంటలకు ఈ రైలు భువనేశ్వర్ స్టార్ట్ అవుతుంది. మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు యశ్వంతాపూర్ చేరుకుంటుంది.

ఈ రైలు బరంపురం, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, పుట్టపర్తి, స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని.. రైల్వే అధికారులు సూచించారు.