తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాలివే-special festivals scheduled to be held at the tirumala srivari temple in the month of may 2025 details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాలివే

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాలివే

మే నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం, మే 6 నుంచి శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే మే నెలలో విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపింది. మే 22వ తేదీన హనుమజ్జయంతి ఉంటుందని పేర్కొంది. ఇవే కాకుండా మరికొన్ని వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది.

మే నెలలో జరిగే విశేష పర్వదినాలు:

  • మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.
  • మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
  • మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.
  • మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.
  • మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.
  • మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
  • మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.
  • మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
  • మే 22న హనుమజ్జయంతి.
  • మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.

శ్రీవారి సేవ - నేడు జూన్ నెల కోటా టికెట్లు విడుదల:

ఇక ఇవాళ శ్రీవారి స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.ఉదయం 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 12:00 గంటలకు నవనీత సేవ (మహిళలకు మాత్రమే), మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ (పురుషులకు మాత్రమే), మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) టికెట్లు విడుదలవుతాయి.

పరిణయోత్సవాలు - పలు సేవలు రద్దు:

మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

3 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాల సంద‌ర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.