తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే మే నెలలో విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపింది. మే 22వ తేదీన హనుమజ్జయంతి ఉంటుందని పేర్కొంది. ఇవే కాకుండా మరికొన్ని వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది.
ఇక ఇవాళ శ్రీవారి స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.ఉదయం 11 గంటలకు జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 12:00 గంటలకు నవనీత సేవ (మహిళలకు మాత్రమే), మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ (పురుషులకు మాత్రమే), మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) టికెట్లు విడుదలవుతాయి.
మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
3 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.