Sabarimala Special Train : కడప మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే-south central railway is running a special train to sabarimala via kadapa ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sabarimala Special Train : కడప మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే

Sabarimala Special Train : కడప మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే

Sabarimala Special Train : అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే పలు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా కడప మీదుగా మరో స్పెషల్ ట్రైన్ సేవలు అందించనుంది.

శబరిమలకు ప్రత్యేక రైలు

కడప మీదుగా అయ్యప్ప భక్తుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లను వేసిన సౌత్ సెంట్రల్ రైల్వే.. జనవరిలో మరో ట్రైన్‌ను నడపనుంది. ఇది కాచిగూడ నుంచి కొట్టాయంకు వెళ్లనుంది. (07151) రైలు జనవరి 2, 9, 16, 23వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని.. కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ జనార్దన్ వివరించారు. ఈ రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరుతుంది. అర్ధరాత్రి 12.10 గంటలకు కడప చేరుకుంటుంది.

మరుసటి రోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం రైల్ నిలయానికి చేరుకుంటుంది. అదే రైలు (07152) తిరుగు ప్రయాణంలో.. జనవరి 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అది కొట్టాయంలో రాత్రి 9.30 గంటలకు బయలు దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు కడప చేరుకుంటుంది. రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని... కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ జనార్దన్ వెల్లడించారు.

భక్తులకు సూచనలు..

శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేసింది. పూజా విధానంలో భాగంగా కర్పూరం, హారతి, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపింది. రైళ్లలో ఇలాంటి పనులు చేయవద్దని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

శబరిమల భక్తులకు కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్‌ స్టేషన్ల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. భక్తులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు సూచనలు చేసింది.

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఏపీ మీదుగా 62 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, కాచిగూడ, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లం, కొట్టాయంలకు భారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది.

తప్పిన ప్రమాదం..

విజయనగరం జిల్లా నుంచి శబరిమలకు వెళ్లిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం బస్సు ఆపారు. బస్సు ప్రక్కనే వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సుకు వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అయ్యప్ప భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.