కన్నబిడ్డలో కాలయముడు.. తల్లిదండ్రులపై ట్రాక్టర్ ఎక్కించిన కొడుకు.. విజయనగరం జిల్లాలో విషాదం-son kills parents with tractor in vizianagaram district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కన్నబిడ్డలో కాలయముడు.. తల్లిదండ్రులపై ట్రాక్టర్ ఎక్కించిన కొడుకు.. విజయనగరం జిల్లాలో విషాదం

కన్నబిడ్డలో కాలయముడు.. తల్లిదండ్రులపై ట్రాక్టర్ ఎక్కించిన కొడుకు.. విజయనగరం జిల్లాలో విషాదం

ఆ ఊరు కొత్తగా నిర్మించే విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిణామం.. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఓ కుమారుడు కర్కశంగా వ్యవహరించి.. కన్నవారినే కడతేర్చాడు. తల్లిదండ్రులపైకి ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

తల్లిదండ్రులను చంపేసిన కుమారుడు (unsplash)

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో నడుపూరి కల్లాలు గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాండ్రంకి అప్పలనాయుడు, జయ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాజశేఖర్‌ ఉన్నాడు. అతనికి రెండేళ్ల కిందట నెల్లిమర్ల మండలం వల్లాపురం పంచాయతీకి చెందిన మహిళతో పెళ్లి చేశారు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది.

కుటుంబంలో గొడవలు..

కానీ ఇటీవల కుమారుడు రాజశేఖర్ తమ మాట కాకుండా.. కోడలు చెప్పిందే చేస్తున్నాడంటూ కుటుంబంలో గొడవలు జరిగాయి. అది కాస్త క్రమంగా ఆస్తి వివాదాలకు దారితీసింది. అటు అప్పలనాయుడు, జయ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఆమెకు పెళ్లి చేయగా.. భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయిన కుమార్తెకు.. అదనంగా కొంత భూమి ఇవ్వాలని తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో కుమారుడిని కోరారు. అందుకు అతను నిరాకరించాడు.

తల్లిదండ్రులు అడ్డుకోబోగా..

ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొంత భూమిని అమ్మేందుకు కుమారుడు రాజశేఖర్ ప్రయత్నించాడు. భూమిని చదును చేయడానికి ట్రాక్టరుతో మట్టిని తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అడ్డుకోబోయారు. దీంతో రాజశేఖర్ వారిపైకి ట్రాక్టర్ ఎక్కించి తొక్కించేశాడు. ఈ ఘటన జిల్లాను ఉలిక్కిపాటుకు గురిచేసింది.

భూముల ధరలకు రెక్కలు..

ఈ గ్రామం భోగాపురం విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే కొందరు జల్సాలకు అలవాటు పడి అప్పుల ఊబిలోకి వెళ్లారు. వాటిని తీర్చడానికి భూములను అమ్ముతున్నారు. ఈ క్రమంలో మానవత్వాన్ని మరిచి రాక్షసుల్లా మారుతున్నారు. రాజశేఖర్ కూడా చేసిన అప్పులు తీర్చేందుకు భూమి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అడ్డుకున్న తల్లిదండ్రులపైకి ట్రాక్టర్‌ ఎక్కించి చంపాడు.

రాజశేఖర్ కోసం గాలింపు..

'వారికి ఆస్తి ఉంది. కొడుకు దానిని అమ్మాలనుకున్నాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది' అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు. ఈ ఘటన తరువాత రాజశేఖర్ అక్కడి నుండి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజశేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని కఠినంగా శిక్షించాలని.. గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనం