Road Accident : రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం దుర్మరణం….
Road Accident కుమార్తె పుట్టిన రోజు కోసం స్వస్థలానికి బయల్దేరిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం స్థానికుల్ని కలచి వేసింది. వరంగల్ జిల్లాకు చెందిన వారు ఏపీలోని సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు.
Road Accident కుమార్తె పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించడానికి బెంగుళూరు నుంచి కారులో వరంగల్ బయల్దేరిన కుటుంబం సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైంది. కుమార్తె తొలి పుట్టినరోజును సొంతూళ్లో జరుపుకోవాలని బయలుదేరిన జంట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పెద్దలు చనిపోవడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు.
ట్రెండింగ్ వార్తలు
వరంగల్ నగరానికి చెందిన గోపీనాథ్, అతని భార్య రమ్యలు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లైన తర్వాత బెంగుళూరులోనే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చూసుకోడానికి గోపీనాథ్ తల్లి తారకేశ్వరి వారితోనే ఉంటున్నారు. ఈ నెల 25న కుమార్తె హాసిని తొలి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు ఈ జంట ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబం మొత్తం కలిసి శనివారం తెల్లవారుజామున బెంగుళూరు నుంచి కారులో వరంగల్కు బయల్దేరారు. దారిలో సత్యసాయి జిల్లా పర్వత దేవరపల్లి గ్రామానికి సమీపంలో కారు ముందు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పింది.
వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మలుపులో ఉన్న రిటైనింగ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రమ్య, గోపీనాథ్లు అక్కడికక్కడే చనిపోయారు. గోపినాథ్ తల్లి తారకేశ్వరిని ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాద సమయంలో కారు సేప్టీ బెలూన్లు తెరుచుకోక పోవడంతో ప్రమాదం ప్రమాద తీవ్రత పెరిగినట్లు గుర్తించారు. చిన్నారులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతురాలు రమ్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ అని బంధువులు చెబుతున్నారు.