Singer Mangli : నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధంలేదు- సింగర్ మంగ్లి-singer mangli denies political affiliation donot paint my song with political colors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Singer Mangli : నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధంలేదు- సింగర్ మంగ్లి

Singer Mangli : నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధంలేదు- సింగర్ మంగ్లి

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 15, 2025 06:35 PM IST

Singer Mangli : సింగర్ మంగ్లీపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ...తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని బహిరంగ ప్రకటన చేశారు. తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని వేడుకున్నారు.

నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధంలేదు- సింగర్ మంగ్లి
నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు, ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధంలేదు- సింగర్ మంగ్లి

Singer Mangli : తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సింగర్ మంగ్లి తెలిపారు. ఈ మేరకు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. "నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నా పై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను" అని సింగర్ మంగ్లి అన్నారు.

ఓ ఆడబిడ్డగా గౌరవించారు

"శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ ప్రోగ్రామ్ కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ ప్రోగ్రామ్ లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గోని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు"

"ఈ కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీసూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారిణిగా నన్ను వాళ్లతోపాటు ఆహ్వానించారు. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఎవరున్నా దైవ దర్శన భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్ప మనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించడం తప్పు అవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ?

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాటపాడాను. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గోనాల్సి వచ్చింది. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు, దూషించలేదు. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను, వైఎస్సార్సీపీ ఒక్కటే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. కానీ అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమయ్యింది" -సింగర్ మంగ్లి

నేను పాటనే నమ్ముకున్నా

దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. నా పాట ప్రతీ ఇంట్లో పండగ పాట కావాలేకానీ పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను"- సింగర్ మంగ్లీ

బంజారా జాతి నుంచి వచ్చి కల్చరల్ పాటలు పాడతున్న సందర్భంలో శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్నా అనే నేపథ్యంలో ఒక కళాకారిణీగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు, పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలోఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటను నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను.

అదంతా ఫేక్ ప్రచారం

"సీఎం నారా చంద్రబాబు నాయుడును నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైసీపీకి పాడిన కారణంగానే కావచ్చు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడ నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని నేను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా? 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయపార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం.

నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ, పక్షపాతాలు కానీ లేవు, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారిణిగా నాకు నా పాటే అన్నింటికన్నా ముఖ్యం. కళకు, కళాకారులకు ఎల్లలులేవని, ఎటువంటి బేధభావాలూ ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధంలేదని మరోసారి విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నాపాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాను"- సింగర్ మంగ్లి

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం