ఇందిరమ్మ ఇండ్ల పథకం.. వేధిస్తున్న తాపీ మేస్త్రీల కొరత.. ఆంధ్రా వర్కర్స్‌కు పెరిగిన డిమాండ్!-shortage of masons in the implementation of the indiramma housing scheme in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇందిరమ్మ ఇండ్ల పథకం.. వేధిస్తున్న తాపీ మేస్త్రీల కొరత.. ఆంధ్రా వర్కర్స్‌కు పెరిగిన డిమాండ్!

ఇందిరమ్మ ఇండ్ల పథకం.. వేధిస్తున్న తాపీ మేస్త్రీల కొరత.. ఆంధ్రా వర్కర్స్‌కు పెరిగిన డిమాండ్!

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించింది. ఎంపిక ప్రక్రియ, నిర్మాణంపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. కానీ.. తాపీ మేస్త్రీల కొరత వేధిస్తోంది. పనులు చేయడానికి తాపీ మేస్త్రీలు లేరు. దీంతో ఆంధ్రా వర్కర్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది.

తాపీ మేస్త్రీల కొరత (unsplash)

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ పథకం ముదుకు సాగాలంటే.. భవన నిర్మాణ పనులు చేపట్టే తాపీ మేస్త్రీలు కీలకం. కానీ ప్రస్తుతం సరిపడా లేరు. దీంతో ప్రభుత్వ ఆదేశంతో అధికారులు దృష్టిపెట్టారు. గ్రామాల్లో కొరత ఉండటంతో.. ఎంపిక చేసిన కొందరికి శిక్షణ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

యువత అనాసక్తి..

యువత అన్ని రంగాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగానికి వచ్చేసరికి విముఖత కనబరుస్తున్నారు. దీంతో శిక్షణ ఇప్పించడం కూడా అధికారులకు కష్టంగా మారుతోంది. అయినా కొందరిని ఎంపిక చేసి.. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు, మెలకువలు ఇతర అంశాలపై నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నారు.

భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా..

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. ఆ ఖర్చుతోనే దృఢమైన నిర్మాణం ఎలా చేపట్టాలి, పునాది ఎలా ఉండాలి, సిమెంటు, ఇసుక, కంకర ఎంత పరిమాణంలో వినియోగించాలి, గోడ గట్టిగా ఉండాలంటే ఏంచేయాలి, స్లాబ్‌లో ఇనుము ఎంత వాడాలి ఇతర అంశాలపై అయిదు రోజులపాటు భోజన సౌకర్యంతో శిక్షణ ఇప్పించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లే కాకుండా.. భవిష్యత్తులో ఇతర ప్రైవేటు భవన నిర్మాణాల్లోనూ వీరికి ఉపాధి లభించేలా చేస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

మొదటిసారిగా మహిళలకు..

కొరత లేకుండా చేసేందుకు మహిళా తాపీమేస్త్రీలను కూడా ప్రభుత్వం రంగంలోకి దించుతోంది. తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో 40 మంది మహిళలు తాపీ మేస్త్రీలుగా శిక్షణ తీసుకున్నారు. వీరికి కూడా న్యాక్ ఆధ్వర్యంలోనే శిక్షణ ఇచ్చారు. గతంలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన అనుభవం ఉన్న మహిళలను ఎంపిక చేశారు. వీరికి తక్కువ బడ్జెట్‌లో ఇంటిని ఎలా నిర్మించాలో శిక్షణలో వివరించారు.

ఏపీ వారికి డిమాండ్..

తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రాలో తాపీ మేస్త్రీలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ సహా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరు పని చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు తాపీ మేస్త్రీల కొరత రావడంతో.. ప్రస్తుతం వీరికి డిమాండ్ పెరిగింది. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో కొందరు లబ్ధిదారులు ఇప్పటికే వీరిని సంప్రదించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆంధ్రా ప్రాంతానికి తాపీ మేస్త్రీలు పనులు చేస్తున్నారు.

సంబంధిత కథనం