Ys Sharmila: పెట్రోల్ ధర రూ.17 తగ్గించండి.. చంద్రబాబు హామీ నెరవేర్చాలన్న షర్మిల
Ys Sharmila: ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.17 వరకు తగ్గించ వచ్చని చెప్పిన చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో దానిని అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్ ధర అధికమని విమర్శించారు.
Ys Sharmila: ఏపీలో పెట్రోల్, డీజీల్ ధరల్ని తగ్గించవచ్చంటూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాటల్ని చంద్రబాబు అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో పెట్రోల్ ధర రూ. 109.60పైసలు, డీజిల్ ధర రూ 97.47 ఉందని, పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86పైసలు ఉంటే డీజిల్ ధర రూ.92.39పైసలు ఉందని గుర్తు చేశారు.
తమిళనాడుతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద రూ.9 డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు, డీజిల్ ధర రూ.88.99పైసలు ఉందన్నారు. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువ ఉందన్నారు.
ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు, డీజిల్ ధర రూ. 95.70పైసలు ఉందని, తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో పన్నులు అధికం, అభివృద్ధి శూన్యం అని ఇది రాష్ట్ర పరిస్థితి అని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
వైసీపీ, టీడీపీలు ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట మాట్లాడుతున్నాయని, గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరోకటి కాదన్నారు.
వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని, దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందు వరసలో పెట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్ర బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారని, అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడన్నారు.
వైసీపీ హయంలో 5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేర ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారని, ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50వేల కోట్లు బాదేశారన్నారు.
రూ.17 ధర తగ్గించాలి…
ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చంద్రబాబు చెప్పారని, లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారని, ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలపై 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం