YS Sharmila : సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు.. చంద్రబాబుకు షర్మిల 9 ప్రశ్నలు
YS Sharmila : ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన షర్మిల.. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అదానీ ఎంత లంచం ఆఫర్ చేశారని నిలదీశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషం అని.. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ? అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్పై ఎందుకు పెట్టలేక పోతున్నారు? అని షర్మిల నిలదీశారు. ప్రభుత్వానికి షర్మిల సంధించిన 9 ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
1.అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా?
2.మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా?
3.నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు?
4.టీజీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ఎస్ఈసీఐతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు.
5.గుజరాత్లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారు. 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారు.
6.ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు?
7.అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు చంద్రబాబు? అంటే ఆనాడు జగన్ అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థం. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థం.
8.చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ఏసీబీని మీ పంజరం నుంచి విడుదల చేయండి.
9.రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ను రద్దు చేయండి.. అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.