నాసిరకం నిర్మాణంతో నే ఎనిమిది మంది భక్తుల దుర్మరణం.. లైట్‌ బ్రిక్స్‌తో సింహాచలంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం-seven devotees die due to shoddy construction retaining wall constructed in simhachalam with light bricks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నాసిరకం నిర్మాణంతో నే ఎనిమిది మంది భక్తుల దుర్మరణం.. లైట్‌ బ్రిక్స్‌తో సింహాచలంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం

నాసిరకం నిర్మాణంతో నే ఎనిమిది మంది భక్తుల దుర్మరణం.. లైట్‌ బ్రిక్స్‌తో సింహాచలంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం

Sarath Chandra.B HT Telugu

సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘోర ప్రమాదానికి దేవాదాయ శాఖ అధికారుల నిర్వాకమే కారణంగా తెలుస్తోంది. మెట్ల మార్గం వెంబడి నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ను లైట్‌ వెయిట్ ప్లైయాష్ బ్రిక్స్‌తో నిర్మించడంతో గోడ కుప్పకూలింది. ఘటనా స్థలంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు.

సింహాచలంలో ప్లైయాష్‌ బ్రిక్స్‌ గోడ కూలి ఎనిమిది మంది భక్తుల మృతి

సింహాచలం అప్పన్న ఆలయ చందనోత్సవం సందర్భంగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రాత్రి రెండున్నరకు గోడ కూలడంతో ఎనిమిదిమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మంగళవారం రాత్రి నుంచి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం బారులు తీరారు. ఉచిత క్యూ లైన్లతో పాటు రూ.300 రుపాయల దర్శనం లైన్లలో కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి ఒంటిగంటకు స్వామి వారికి మేల్కొలుపుతో పూజలు మొదలయ్యాయి.

మంగళవారం రాత్రి సింహాచలం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో కొండలు తడిచి ముద్దయ్యాయి. సింహాచలం ఆలయ మెట్ల మార్గం వెంబడి ఉన్న ప్రదేశంలో రూ.300 దర్శనం టిక్కెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు. మెట్లకు దన్నుగా రిటైనింగ్‌ వాల్ నిర్మించారు.

సాధారణంగా ఘాట్‌రోడ్లలో రిటైనింగ్‌ వాల్స్ నిర్మాణాలను రాతి కట్టడాలుగా నిర్మిస్తారు. ఇటీవలి కాలంలో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. సింహాచలంలో మాత్రం దేవాదాయ శాఖ నిర్వాకం స్పష్టంగా బయట పడింది. ప్లైయాష్‌‌తో తయారు చేసిన లైట్‌ బ్రిక్స్‌తో గోడ నిర్మాణాన్ని చేపట్టారు. నాసిరకంగా నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భారీ వర్షంతో ఎగువ నుంచి మట్టి జారడంతో అది కాస్త కూలిపోయింది.

మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. మెట్లకు పక్కనే రెండడుగుల గోడ ఉన్నా వర్షపు నీరు కలిసి మట్టి బరువు పెరిగిపోయింది. అదే సమయానికి బలమైన గాలులు వీయడంతో తాత్కలిక షెడ్లు కదలిపోయాయి. వాటి కోసం ఇనుప స్తంభాలు కదిలిపోయాయి. గోడ ధృడంగా లేకపోవడంతో దాని దిగువున ఎదురు చూస్తోన్న భక్తులపై కుప్పకూలింది.

ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన లూజ్‌ సాయిల్ ఉన్న ప్రాంతాల్లో లైట్‌ బ్రిక్స్‌తో నిర్మాణాన్ని ఎలా అనుమతించారనేది చర్చనీయాంశంగా మారింది. కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేపుడు బలమైన పునాదులతో కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలిన ప్రాంతంలో ఐరన్‌ మెష్‌ ఉండటంతో ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గింది.

ముఖ్యమంత్రి సంతాపం

వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తనను కలిచి వేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం

సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు.

స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం