Jabalpur Accident: కుంభమేళా తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. జబల్పూర్లో హైదరాబాద్కు చెందిన 8మంది దుర్మరణం…
Jabalpur Accident: కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎనిమది మంది ప్రాణాలు కోల్పోయారు.సిహోరా సమీపంలో వంతెనపై టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.

Jabalpur Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న టూరిస్ట్ బస్సును భారీ ట్రక్కు ఢీకొట్టడంతో హైదరాబాద్కు చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మంగళవారం ఉదయం 9.15కు ఈ ప్రమాదం జరిగింది. 30వ నంబరు జాతీయ రహదారిపై సిహోరా వద్ద వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ బస్సు నుజ్జయ్యింది. ట్రావెల్ బస్సులో ప్రయాగరాజ్ వెళ్లి తిరిగి వస్తుండగా జబల్పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన స్థలానికి జబల్పూర్ ఎస్పీ, కలెక్టర్ చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మృతి చెందిన వారిని హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. నాచారం రాఘవేంద్ర నగర్ నుంచి కుంభమేళాకు వెళ్లిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవీన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా మృతులను ఏపీకి చెందిన వారిగా భావించారు. ట్రావెల్స్ వాహనం నంబర్ ఏపీ 29 అని ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా భావించారు. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలతో మృతులను గుర్తించారు. మృతులు ఆనంద్, మల్లారెడ్డి, నవీన్, బాలకృష్ణ, శశికాంత్, సంతోష్, రవిలుగా గుర్తించారు. వీరంతా సమీప బంధువులుగా భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియడంతో హైదరాబాద్లోని వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జబల్పూర్-ప్రయాగ్ రాజ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్స్ మినీ బస్సు (AP29w1525) ఎదురుగా వస్తున్న సిమెంట్ నిండిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సిహోరా వంతెన మధ్యలో వాహనాలు ఇరుక్కుపోవడంతో వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో 12మంది ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి సంతాపం…
• మధ్యప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యాత్రికుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
• సచివాలయంలో సెక్రటరీల సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు.
• ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు.
• మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు.
• ఏడుగురు చనిపోయారని వస్తున్న వార్తలపై సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.
• ప్రస్తుతం తెలుగు ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం