HEART TRANSPLANTATION :శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి సర్జరీ-second successful heart transplantation at sp childrens heart centre ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Second Successful Heart Transplantation At Sp Childrens Heart Centre

HEART TRANSPLANTATION :శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి సర్జరీ

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 11:53 AM IST

HEART TRANSPLANTATIONశ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అరుదైన రికార్డ్ నమోదు చేసింది. నెల రోజుల్లో విజయవంతంగా రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్సను పద్మావతి చిన్నపిల్లల హృదయాలంలో విజయవంతంగా నిర్వహించారు.

టీటీవీ ఈవోకు కృతజ్ఞతలు చెబుతున్న  జార్ఖండ్‌కు చెందిన పర్వీన్
టీటీవీ ఈవోకు కృతజ్ఞతలు చెబుతున్న జార్ఖండ్‌కు చెందిన పర్వీన్

HEART TRANSPLANTATION టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నెలరోజుల్లోనే రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గ్రీన్ చానల్ కూడా లేకుండా పక్కా ప్రణాళికతో చెన్నై నుంచి తిరుపతికి గుండె తరలించారు. 13 నెలల పాపకు ప్రాణం పోశారు. శస్త్ర చికిత్స చేసిన వైద్య బృందంను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలోని వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నెలల చిన్నారికి శస్త్ర చికిత్స ద్వారా గుండె మార్పిడి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. పక్కా ప్రణాళిక తో గ్రీన్ చానల్ కూడా లేకుండా చెన్నైలో బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి గుండెను సేకరించి తిరుపతికి తీసుకుని వచ్చి 13 నెలల పాపకు ప్రాణం పోశారు.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాపకు గుండె తీవ్రంగా దెబ్బతినింది. తల్లిదండ్రులు ఆ పాప ను విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. పాపకు గుండె మార్చాల్సి ఉందని, తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రికి వెళ్ళాలని డాక్టర్లు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రికి తీసుకు వచ్చి అడ్మిట్ చేశారు. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేశారు. మందులతో పాప ఆరోగ్యం కాపాడుతూ వచ్చారు. చెన్నె లోని ఎంజిఎం ఆసుపత్రిలో రెండేళ్ళ బాబుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని, గుండె దానం చేస్తారనే విషయం ఆదివారం శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డికి తెలిసింది.

ఎపి జీవన్ దాన్ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్ గణపతి బృందాన్ని ఆయన సమన్వయం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మాచర్ల లోని పాప తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో రాత్రి 10 గంటలకు వారు ఆసుపత్రికి చేరుకున్నారు. రాత్రి 10-30 గంటలకు పాపకు అవసరమైన పరీక్షలు, కోవిడ్ పరీక్ష కూడా చేసి గుండె మార్పిడి చేయొచ్చని నిర్ధారించుకున్నారు.

టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2గంటల 15 నిముషాల్లో గుండెను తిరుపతి ఆసుపత్రికి తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నిముషం కూడా ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున 3 గంటలకు గుండె ను తిరుపతి ఆసుపత్రికి తెచ్చారు. 45 నిముషాల్లో మెడికల్ ప్రొసీజర్స్ పూర్తి చేసి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని వైద్య బృందం ఉదయం 4-30 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించి ఉదయం 9-30 గంటలకు విజయవంతంగా పూర్తి చేసింది.

రూ 30 లక్షల ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్స టీటీడీ ప్రాణదానం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తి ఉచితంగా చేశామని ఈవో తెలిపారు. మరో మూడు నాలుగు రోజులు పాపను ఐసీయూలో ఉంచి తరువాత వార్డుకు మారుస్తారని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.

గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అనుమతి లభించిన నెలరోజుల్లోనే రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం దేశంలోనే రికార్డు సృష్టించిందని ఈవో అభినందించారు. నెలరోజుల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కె ఎస్ ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల విశ్వేశ్వర్‌ను సోమవారం డిశ్చార్జ్ చేస్తున్నట్లుె ఈవో తెలిపారు. పాప పూర్తి ఆరోగ్యవంతురాలై త్వరగా డిశ్చార్జ్ కావాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని అందరూ ప్రార్థించాలని కోరారు.

ఆసుపత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన పిల్లలకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ , ప్రధానమంత్రి ఆరోగ్య భీమా కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వివరించారు. ఇలాంటి ఆసుపత్రి రాష్ట్రంలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి ఒక్కటేనన్నారు.

జార్ఖండ్ చిన్నారికి శస్త్ర చికిత్స

జార్ఖండ్ రాజధాని రాంచికి చెందిన లుక్సార్ పర్వీన్ మూడు నెలల కుమారుడికి వైద్య బృందం విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించింది. వేలూరు లోని సిఎంసి ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళిన పర్వీన్ కు అక్కడి వైద్యులు తిరుపతి లోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి కి వెళ్ళాలని సిఫారసు చేశారు. బాబును తిరుపతికి తీసుకుని వచ్చి అడ్మిట్ చేయడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి 15 రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. బాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని పర్వీన్ సంతోషం వ్యక్తం చేశారు. తన బాబు ప్రాణాలు కాపాడిన టీటీడీ కి, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

IPL_Entry_Point