తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు.. ప్రజల ఆరోగ్యంతో మామిడి వ్యాపారుల ఆటలు!-sales of mangoes coated with chemicals in andhra pradesh and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు.. ప్రజల ఆరోగ్యంతో మామిడి వ్యాపారుల ఆటలు!

తియ్యని పండ్ల వెనుక చేదు నిజాలు.. ప్రజల ఆరోగ్యంతో మామిడి వ్యాపారుల ఆటలు!

కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా.. మామిడి విషతుల్యంగా మారుతోంది. కాయలను కృత్రిమంగా మాగబెట్టి.. మార్కెట్లకు తరలిస్తున్నారు. మాగబెట్టడం కోసం నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటి వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మామిడి పండ్లు (pixabay)

నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోటలను కొనుగోలు చేస్తారు. ఆ పంట వరకు డబ్బులు చెల్లించి.. కోత మొదలు పెడతారు. దీంతో రైతులకు పండ్లతో సంబంధం ఉండదు. కేవలం పండించడమే వారి బాధ్యత.

తొందరగా పక్వానికి వచ్చేలా..

ఇదంతా ఎలా ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించని రైతులు.. పండ్ల పండాక కోసి.. మార్కెట్లకు తరలిస్తారు. కానీ.. వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో.. పండ్లు పూర్తిగా పండకముందే.. కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.

ఎన్నో సమస్యలు..

రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా.. క్యాన్సర్, అల్సర్, లివర్‌, కిడ్నీ, జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనతలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాల్షియం కార్బైడ్‌ ద్వారా వెలువడే ఎసిటిలిన్‌ వాయువు.. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి.

నిబంధనల ప్రకారం..

2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు ప్రకారం.. ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్‌ రసాయనాలను నిషేధించింది. సహజంగా పండించే ఇథిలిన్‌ను మాత్రమే కొంత వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మేలిమి పండులా కనిపించేందుకు వ్యాపారులు కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్‌లో చౌకగా లభిస్తుండటంతో వీటిని వ్యాపారులు ఇష్టానుసారంగా వాడుతున్నారు.

తినకపోవడమే మంచిది..

'కృత్రిమంగా పండించిన పండ్లను తిన్న వారికి వాంతులు, విరేచనాలు, దాహం ఎక్కువగా కావటం, కడుపులో తిప్పటం వంటి సమస్యలు వస్తాయి. మామిడి పండ్లను తినే ముందు ఉప్పు నీటిలో కడగాలి. కృత్రిమంగా పండించిన పండ్లను సాధ్యమైనంత వరకు తినకపోవడం మంచిది' అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనం