జూన్ 9 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 'జ్యేష్టాభిషేకం' - విశిష్టత ఇదే-salakatla jyeshtabhishekam will be held at the srivari temple in tirumala from june 9 to 11 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  జూన్ 9 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 'జ్యేష్టాభిషేకం' - విశిష్టత ఇదే

జూన్ 9 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 'జ్యేష్టాభిషేకం' - విశిష్టత ఇదే

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య అప్డేట్ ఇచ్చింది. జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నున్నట్లు పేర్కొంది.

ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.

3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు…

  • మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు.
  • రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు.
  • మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
  • ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.

3 రోజులపాటు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించిన తరువాత చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో దర్శనమిచ్చి భక్తులను అలరిస్తారు. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ల మార్పు:

మరోవైపు శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది.

ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.