Sajjala On Chandrababu : ‘ఇదేం కర్మ బాబు’ అని పెడితే బాగుండేది - సజ్జల సెటైర్లు
sajjala on chandrababu kurnool tour: చంద్రబాబు కర్నూలు టూర్ పై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. న్యాయరాజధానిపై అక్కడి ప్రజలు అడిగితే… చంద్రబాబు రౌడీయిజం చూయిస్తున్నారని విమర్శించారు.
sajjala ramakrishna reddy slams chandrababu: కర్నూలు పర్యటనలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలు చేశారని... అసలు 40 ఏళ్ల ఇండస్ట్రీకి ఎందుకు అంత కోపం వచ్చిందో..? అని ఎద్దేవా చేశారు. పవన్ లాగే చంద్రబాబు కూడా చెప్పు చూపించాలనే కోరిక ఉన్నట్లుందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఓ పార్టీ అధినేతగా సీమ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రజలు న్యాయరాజధానిపై అడుగుతారని... దానికి సమాధాం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంటుందన్నారు సజ్జల. అమరావతిపై వివరణ ఇవ్వాలని... మూడు రాజధానులపై అభిప్రాయమేంటో చెప్పాలని హితవు పలికారు. వికేంద్రీకరణ విషయంలో తమ ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉందని... అదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నామని చెప్పారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగిందని.. దాని ప్రకారమే కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా చంద్రబాబుని ప్రశ్నించారు..కర్నూలులో కూడా అదే విధంగా అడుగుతారని అన్నారు. వైఖరి చెప్పాలని అడిగితే... రౌడీని, గుండాను అంటూ చంద్రబాబు బెదిరించారని సజ్జల విమర్శించారు. ప్రజల ప్రశ్నలను డైవర్ట్ చేయటానికే చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారని చెప్పారు. రామోజీరావు చిట్ ఫండ్ కంపెనీలపై దాడులు జరిగితే... రాజకీయకక్ష అని ఎలా అంటారని ప్రశ్నించారు. అసలు రామోజీరావు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా..? అని నిలదీశారు. చంద్రబాబు ప్రజలను, పోలీసులను తిడుతున్నారని దుయ్యబట్టారు. అనవసరంగా భువనేశ్వరి పేరును కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని అన్నారు.
చంద్రబాబు రీతిలో పవన్ వ్యవహరిస్తున్నారని సజ్జల ఆక్షేపించారు. చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదేం కర్మ అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమంపై కూడా సజ్జల సెటైర్లు విసిరారు. ఇదేం కర్మ బాబు అని పేరు పెడితే బాగుంటుందంటూ హితవు పలికారు. గతంలో ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలన్నారు.