Vizag Admin Capital : విశాఖకు పరిపాలన రాజధాని వెళ్ళడం ఖాయమన్న సజ్జల
Vizag Admin Capital విశాఖకు పరిపాలన రాజధాని తరలి వెళ్ళడం ఖాయమన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడైనా ప్రారంభం కావచ్చొని, అది రాష్ట్ర ప్రజల అవసరమన్నారు.
Vizag Admin Capital విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ఎప్పుడైనా ప్రారంభం కావచ్చన్నారు ప్రభుత్వ ప్రజావ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. పరిపాలన రాజధాని విశాఖకు వెళ్ళడం ఖాయమని స్పష్టం చేశారు. విశాఖలో పరిపాలన అనేది ఎప్పుడైనా ప్రారంభం కావచ్చన్నారు. ఉద్యోగులు తరలి వెళ్లడానికి సమయం అనుకూలంగా ఉండాలని, కోర్టుకు సంబంధించి చిన్నచిన్నసమస్యలు ఉంటే వాటిని దాటుకుని విశాఖకు వెళతామన్నారు. పట్టుదల కోసమో లేదా ఎవరి కోసమో కాదని, సహజంగా జరుగుతుందన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవసరమని, దశాభ్దాల తరబడి కల దాన్ని పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ కల్యాణ్ కొద్దినెలలక్రితం చేసిన ప్రకటనకు ఓ రూపం ఇవ్వడం కోసం చంద్రబాబు ఆయనను కలిశారు. చంద్రబాబు పుట్టి మునిగింది. ఆయన ఎప్పుడూ రెండు మాటలు మాట్లాడుతుంటారు. టిడిపి నేతలు ఎవ్వరూ ఆయనతో నిలబడటం లేదు. వారిని నిలబెట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నారని విమర్శించారు. తనకు ఎలాగూ లేదు ఫలానా వ్యక్తి పక్కన ఉంటే నాలుగు ఓట్లు సంపాదించుకోవచ్చని ఆశ చంద్రబాబుదన్నారు. మిగిలినవారంతా నన్నే సపోర్ట్ చేస్తున్నారనే భావన కలిగించడం కోసం నానా పాట్లు పడుతుంటారు. అవకాశాలు రాకపోయినా సృష్టించుకుని ప్రయత్నం చేస్తున్నారని, హైదరాబాద్ నుంచి హుటాహుటిన నోవాటెల్ కు వచ్చారని విమర్శించారు.
40 ఏళ్ళ ఆయన అనుభవం,పెద్ద పార్టీ అధ్యక్షుడు అనేవి వదులుకుని పవన్ కల్యాణ్ దగ్గరకు ఆయన ఆశీస్సులకోసం వెళ్లారు. ఎందుకు చేశాడు అంటే పవన్ కల్యాణ్ నాతో ఉన్నారు. అలా చెబితే నలుగురు నాయకులు నిలబడతారని చంద్రబాబు ఆశ అని విమర్శించారు. ఆ రోజు విడిగా పోటీ చేసినా, ఈరోజు కలుస్తున్నామని చెప్పినా,దానికో అందమైన రంగువేసి ప్రజాస్వామ్య రక్షణ అని అందమైన పేరు పెట్టినా… ఏధైనా సరే చంద్రబాబు కోరికేనన్నారు. చంద్రబాబు చేసే ప్రయత్నం ఒక్కటేనని బిజేపి నుంచి కమ్యూనిస్ట్ ల వరకు అందర్నీ కలుపుకుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే ఆయన లక్ష్యమన్నారు.
చంద్రబాబు తాను గతంలో 2014-19మధ్య అధికారం ఇచ్చినప్పుడు చాలా చేశాను. లేదా చేయలేకపోయాను. తిరిగి అధికారం ఇస్తే బాగా చేస్తాను అని చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలి. కాని చంద్రబాబు అలా చేయడని ఆయన నాయకుడు కాదని, ప్రజల్లో లేడని సజ్జల విమర్శించారు. కృత్రిమంగా మామ ఎన్టీఆర్ సంపాదించిన అధికారాన్ని పొంది వచ్చిన నాయకుడని, ఆయనకు తెలిసిన విద్యలు మూడు,నాలుగేనన్నారు. అప్పటికప్పుడు ఎవరైనా దొరికితే పొత్తు పెట్టుకోవడం, వాళ్ళ భుజాలపైకి ఎక్కిఅధికారంలోకి రావడం, మళ్ళీ ప్రజలను నానా హింస పెట్టడం. నెక్స్ట్ ఎన్నికలలో తిరిగి పొత్తులు ఏమైనా ఉంటాయో చూసుకోవడం. ఇదంతా చూస్తే మీడియాకు కొంత సరంజామా ఉంటుందే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు.
అది ఎన్నికల కోసం కాదు…..
మూడు రాజధానుల అనేది గెలిపించే ఎజెండా అని మేము ఎప్పుడూ భావించలేదన్నారు.దాని గురించి ఆలోచించాల్సి వచ్చిదంటే ఒక పగటికల లాంటి ఆచరణలో అసాధ్యమైన లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా సాధ్యం కానిది అమరావతి అన్నారు. ఒక నగరం తయారు కావాలంటే 20 నుంచి 30 ఏళ్ళు తీసుకుంటుందని, ఈరోజు హైద్రాబాద్ లో హైటెక్ సిటీని చూస్తే నేదురుమిల్లి జనార్ధనరెడ్డి,చంద్రబాబు లాంటి వారి తర్వాత నేడు మూడు దశాబ్ధాలు దాటినా ఇప్పటికీ హబ్స్ తయారవుతున్నాయి తప్ప నగరం తయారుకావడంలేదన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా 30 వేల ఎకరాలపై కన్నువేసి రూపొందించిన ప్రాజెక్టు అని. చంద్రబాబు,ఆయన భాగస్ధులు అనుకున్న కలలు భగ్నమయ్యాయన్నారు
శ్రీభాగ్ ఒప్పందం అయినా , ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం అయినా ఎప్పుడైనా వారు ఒక్కటే అడుగుతున్నారని మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయండి అనే డిమాండ్ ప్రజల్లో ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అదే చెప్పిందని అభివృధ్ది అనేది డిస్టిబ్యూట్ కావాలని స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పెట్టిన నారాయణ కమిటీలో ఇద్దరు ముగ్గుర్ని కూర్చోబెట్టి అందర్ని మోసం చేశావని విమర్శించారు. రాజధాని విషయంలో కేంద్రాన్ని కూడా మోసం చేశారని కాని ఐదేళ్ళలో ఏం చేశారని ప్రశ్నించారు. 20 నుంచి 30 కిలోమీటర్లు ఏవైపు పోయినా జనసంచారం కనపడనిచోట జెండా పాతావని అక్కడ అభివృధ్ది చేయకపోతే చరిత్ర హీనుడవు అవుతావని జగన్ ని అంటే అంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా, అందుకే జనం అందుకే దానిని పట్టించుకోవడం లేదున్నారుే.
వైజాగ్ ఆల్రెడీ అభివృధ్ది చెంది ఉందని, దానికి గ్రోత్ కు అవకాశం ఉందని అందుకోసం అక్కడ పరిపాలన రాజధాని పెడదాం అని, కర్నూలులో న్యాయరాజధాని పెడదాం అన్నది ప్రభుత్వ విధానమన్నారు. ఎందుకంటే శ్రీభాగ్ ఒడంబడికలో ఉంది. బిజేపి,లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేశాయని ఇక్కడ ఎలాగూ అమరావతిని డెవలప్ చేద్దామని జగన్ నిర్ణయించారన్నారు. స్టేట్ స్వరూపం చూస్తే మూడూ ప్రాంతాలలో మూడు హబ్స్ తయారవుతాయని ఇది సరైనదని ఎవరికైనా అనిపిస్తుందన్నారు. ఆ పప్పులు ఉడకవని తెలిసి కృత్రిమంగా పాదయాత్ర అని పెట్టి అందర్ని రెచ్చగొట్టి ఇష్యూను లైమ్ లైట్ లో పెడితే ఆ ఇష్యూ వల్ల తనకు ఉపయోగం కలుగుతుందనే ఆశ. జగన్ గారు చేస్తున్న సంక్షేమ యజ్ఞం దృష్టి మళ్ళించి తన అజెండా తీసుకురావడానికి వాడుకుంటున్నారు. మేం చేస్తున్నది సహజ న్యాయం.