Sajjala On Chandrababu : చంద్రబాబు ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నారు?
Sajjala Comments On Chandrababu : ఏపీలో బీజేపీతో దోస్తీ కోసం తెలంగాణలో బాబు తంటాలు పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో సరే.. మరి ఏపీ బీజేపీలో ఉన్న స్లీపర్ సెల్స్ సంగతేంటని ప్రశ్నించారు. పల్నాడును వల్లకాడు చేయాలన్నదే బాబు కుట్ర అని ఆరోపించారు.
చంద్రబాబు(Chandrababu) ఏ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నాడో తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. 2014లో తెలంగాణలో యాక్టివ్గా ఉన్న చంద్రబాబు అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్ళీ తెలంగాణలో మా పార్టీ ఉంది అని ఎందుకు చెప్పదలుచుకున్నాడోనన్నారు. ఎటువంటి ప్రయోగం చేయాలనుకుంటున్నాడో ముందుగా ప్రజలకు చంద్రబాబు వివరించాలని చెప్పారు. ఆయనకు హైదరాబాద్(Hyderabad)లోనే ఇళ్లు ఉంది.. మొన్నటి వరకూ ఆయన ఓటు కూడా అక్కడే ఉందని సజ్జల అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఎక్కడ ఉండాలనుకుంటున్నారు?
'తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకుంటే మంచిదే. కానీ ఎన్నికలొచ్చే సమయానికి అక్కడికి వెళ్లి ప్రజలతో ఆడుకోవడం, రాజకీయాలంటే ఒక ఆట అనుకునే అలవాటు చంద్రబాబుకు ఉంది. అదే ఇప్పుడు అనుసరిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ తెలంగాణ వెళ్లి హడావుడి చేస్తున్నాడు. గత ఎన్నికలను గమనిస్తే రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానిని చేయాలని, యూపీఏకు కన్వీనర్ కావాలనుకున్నాడో ఏమో కానీ, దేశంలో చక్రం తిప్పుతానంటూ ఆయనతో తిరిగి చతికిలపడ్డాడు. అసలు చంద్రబాబు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో స్పష్టత ఇవ్వడు.' అని సజ్జల అన్నారు.
జగన్ క్లారిటీ ఉంది
సీఎం జగన్ కు క్లారిటీ ఉందని.. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సేవ చేయాలనుకున్నారని, అనివార్యంగా, అన్యాయంగా విభజన జరిగిందన్నారు. ఆ తర్వాత ఏపీలో సేవ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు.
చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమేనని సజ్జల పేర్కొన్నారు. రాత్రికి ఒక మాట..పగలు ఒక మాట.. ఒక్కో పార్టీ వద్ద ఒక్కో మాట మాట్లాడుతూనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ వెళ్లి రెండు రాష్ట్రాలు విడివిడిగానే ఉండాలని మాట్లాడుతున్నాడు తప్ప., ఆంధ్రప్రదేశ్లో ఆ మాట మాడ్లాడటం లేదని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి పాత తెలుగుదేశం(Telugu Desam) వాళ్లంతా రండి అంటున్నాడని, ఇక్కడ ఏపీలో బీజేపీ స్లీపర్ సెల్స్గా ఉన్నవారిని మాత్రం పిలవడం లేదన్నారు.
డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్సీపీ(YSRCP)లోనే ఉన్నానని ఇప్పుడెందుకు అనుకుంటున్నారో మాకు అర్థం కాలేదని సజ్జల అన్నారు. 2019 ఎన్నికల సమయంలో మా పార్టీలోకి వచ్చాడని, ఆ రోజే ఫీల్ఢ్లో ఏం జరిగిందో అక్కడి ఎమ్మెల్యే చెప్తారన్నారు. ఆయన పార్టీలో ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
మీరే టెండర్లో పాల్గొనవచ్చు
'ట్యాబ్ల పంపిణీలో వాళ్లిష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారు. ట్యాబ్స్(Tabs) విలువే 500, 600 కోట్లు ఉంటుంది. కంటెంట్ ను బైజూస్ ఫ్రీగా ఇస్తోంది. అది కూడా తెలియకుండా 1400 కోట్ల అవినీతి అని టీడీపీ(TDP) నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. టెండర్ల విధానంలో ఒక స్టాండర్డ్ కంపెనీ శాంసంగ్ ముందుకు వచ్చింది. వారిచ్చిన కోట్ కంటే మరింత తగ్గించేలా చర్చలు కూడా జరిపాం. ఆ ట్యాబ్స్ లో ఫీచర్స్ అధికంగా ఇస్తున్నారు. అవే ఫీచర్లతో అలాంటి ట్యాబ్ లు ఇంకా తక్కువ ధరకు ఇప్పించగలిగితే.. టీడీపీ వాళ్లు అన్నట్లు 12 వేలకు ఇప్పించగలిగితే వాళ్లే టెండర్లో పాల్గొనొచ్చు.' అని సజ్జల అన్నారు.
కాపు రిజర్వేషన్లలో టీడీపీ, వారి అనుకూల పత్రికలు ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం ఏమీ చెప్పలేదని సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. నిర్ణయం రాష్ట్ర పభుత్వం ఇష్టం అని మాత్రమే అన్నారన్నారు. ఒక వేళ 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశమే ఉంటే ఆనాడే చంద్రబాబు(Chandrababu) అమలు చేసి ఉండోచ్చు కదా అని ప్రశ్నించారు. చేయలేదంటే అర్ధం ఏమిటో ప్రజలు గమనించాలన్నారు.
పల్నాడు(Palnadu)ను.. చంబల్ వ్యాలీ అని ఒకడు ...తాలిబాన్ రాజ్యం అని మరొకడు చిత్రీకరిస్తూ, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పల్నాడును వల్లకాడు చేయాలనే దురాలోచనతో చంద్రబాబు మొదలు పెట్టిన కుట్ర అది. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడూ అనుమతించదు. పల్నాడు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. వైఎస్సార్సీపీ అక్కడ బలంగా ఉంది కాబట్టి అక్కడ ప్రశాంతతే ఉంటుంది. ఏదో జరిగిపోతోంది అనే వాతావరణం క్రియేట్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. వారి కుట్రలు సాగవు. మాచర్లలో టీడీపీ ఇన్ చార్జిగా బ్రహ్మారెడ్డిని దించినప్పటి నుంచీ ఈ అరాచకాలు జరుగుతున్నాయి.
రుషికొండపై కమిటీ వేస్తే మంచిదేగా
'రుషికొండ(Rushikonda) విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ల స్వేచ్ఛ. ఏం చేసినా అదేం రహస్యంగా జరిగేది కాదు కదా..? కొండ అక్కడే ఉంది..అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాల్సి వస్తుంది. గుట్టలు ఉన్న చోట అలానే వస్తుంది. మిలీనియం టవర్స్ కట్టేటప్పుడు కూడా అదే చేశారు. కోర్టు అక్కడ వాస్తవం ఏమిటో చూడాలని కమిటీ వేసినట్లు ఉంది. వాళ్లు వచ్చి చూసి అక్కడి వాస్తవాలు తెలుసుకుంటారు. అక్కడ రహస్యంగా దాచిపెట్టుకోడానికి ఏమీ లేదు.' అని సజ్జల అన్నారు.
సంబంధిత కథనం