YSRCP Coteries: వైసీపీని వీడిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్ట్, సెజ్ బదలాయింపు వ్యవహారంలో ఏపీ సీఐడీ ఎదుట బుధవారం హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటల పాటు సీఐడీ సాయిరెడ్డిని ప్రశ్నించింది. సీఐడీ విచారణ ముగిసిన తర్వాత సాయిరెడ్డి దర్యాప్తు తీరును పూసగుచ్చినట్టు వివరించారు. సాయిరెడ్డి సాధారణ వైఖరికి భిన్నంగా తాజా పరిణామాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. నేరుగా వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీపై విమర్శలు గుప్పించారు. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఢీకొట్టేలా మాట్లాడిన తీరు చర్చనీయాశమైంది.
కాకినాడ సీ పోర్ట్, కాకినాడ సెజ్ల బదలాయింపు వ్యవహారంలో తనకు సంబంధం లేదన్న సాయిరెడ్డి... ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. కేవీరావుతో ఎప్పుడు మాట్లాడలేదని అవసరమైతే కాల్ డేటా పరిశీలించుకోవచ్చన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరును నేరుగా ప్రస్తావించారు. వైసీపీలో జగన్ కోటరీల వల్ల తాను అవమానాలు పడ్డానని ఆరోపించారు.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జరిగిన రకరకాల రాజకీయ పరిణామాల్లో జగన్తో పాటు సాయిరెడ్డి ఆయన వెన్నంటి ఉన్నారు.ఇప్పటికీ జగన్తో పాటు సహ నిందితుడిగా కేసులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ పోర్ట్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆయన పదవులకు రాజీనామా చేశారు. తెర వెనుక ఏమి జరిగిందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్డి తిరుగులేని అధికారాన్ని అనుభవించారు.అంతకు ముందు దాదాపు 5ఏళ్ల పాటు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీలో కీలకమైన స్థానాన్ని సాయిరెడ్డి అనుభవించారు. వైసీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడిగా, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి హోదాలో ముఖ్యమంత్రి తర్వాత స్థానాన్ని అనధికారికంగా అనుభవించారు. ఢిల్లీలో సాయిరెడ్డి మినహా మిగిలిన ఎంపీలు ఎవరు నోరెత్తకూడదు అన్నట్టు హవా సాగింది. గత పదేళ్లలో సాయిరెడ్డి, మిథున్ రెడ్డి మినహా వైసీపీ తరపున గెలిచిన ఎంపీలెవరో కూడా జనానికి గుర్తు లేకుండా పోయింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు, ఎంపీలు తన కనుసన్నల్లో ఉండేలా సాయిరెడ్డి హవా సాగింది. రెండేళ్లకు పైగా సాగిన సాయిరెడ్డి హవా ఆ తర్వాత తగ్గడం మొదలైంది.స్థానిక ప్రజా ప్రతినిధులతో విభేదాలు, ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీల ఫిర్యాదులతో తాడేపల్లిలో సాయిరెడ్డి హవా తగ్గడం మొదలైంది. ఢిల్లీలో మాత్రం తన పట్టు నిలబెట్టుకున్నారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంలో సక్సెస్ అయ్యారు.
వైసీపీలో తాను అనేక అవమానాలతో తాను ఒక్కో మెట్టూ దిగిపోతుంటే.. అది కొందరు ద్వితియ శ్రేణి నాయకులు పైకి ఎక్క డానికి ఉపయోగపడిందని సాయిరెడ్డి బుధవారం ఆరోపించారు. తనకు జగన్కు మధ్య దూరం పెంచి కొందరు లాభపడ్డారని, ద్వితీయశ్రేణి నాయకులు కొందరు తనకు, జగన్కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, మనసు విరిచేశారని చెప్పారు.
జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని ఆయన వద్దకు ఎవరినైనా తీసుకెళ్లి పరిచయం చేయా లనుకున్నా, ఎవరైనా ఆయన్ను కలవాలనుకున్నా... వారు ఈ కోటరీకి అనుకూలురై ఉండాలని వారితో నయానో, భయానో మెలగాలని వారి కాళ్లు, చేతులు పట్టుకుంటేనో, ఆర్థికంగా లబ్ది చేకూరిస్తేనో జగన్ దగ్గరకి పంపిస్తారని లేకపోతే ఈ పూజారులు దేవుడి దగ్గరకు పంపరని ఆరోపించారు. వారివల్లే తాను జగన్కు దూరమయ్యానని సాయిరెడ్డి ఆరోపించారు.
కోటరీ నుంచి బయటపడితేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే చాలా కష్టం. ఇంతకు మించి చెప్పగలిగిందేమీ లేదన్నారు. మీతో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్ తోనే చెప్పానని, “మీ మనసులో నాకు స్థానం లేదు. అలాంటప్పుడు మీతో కొనసాగాల్సిన అవసరం లేదని, తన మనసు విరిగిపోయింది. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతునట్టు”.. జగన్కు చెప్పినట్టు సాయిరెడ్డి వివరించారు.
సీఐడీ కార్యాలయం వద్ద సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమేనని వైసీపీ అనుమానిస్తోంది. అదే సమయంలో జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఎవరనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ద్వితియ శ్రేణి నాయకులని వ్యాఖ్యానించడంతో సందేహాలు వ్యక్తమైనా వైసీపీలో అధినేత జగన్ తప్ప అంతా ద్వితియ శ్రేణి అనే క్లారిటీ పార్టీ వర్గాలు ఇచ్చాయి.
సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు యాధృచ్చికం కాకపోవచ్చు. పర్యావసనాలు ఊహించే సాయిరెడ్డి తన లక్ష్యాలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. తన స్థితికి కారణమైన వారిపై బదులు తీర్చుకునే లక్ష్యంతోనే తాజా విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది. గత మూడు నాలుగేళ్లుగా జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులకు బాధ్యులైన వారిని టార్గెట్ చేస్తూ తాజా విమర్శలు చేసినట్టు స్పష్టం అవుతంది.
ఐదేళ్ల క్రితం కోవిడ్ లాక్డౌన్ సమయంలో విశాఖపట్నంలో 2020 మే నెలలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం హోదాలో జగన్ విశాఖ బయల్దేరారు. సీఎంతో పాటు ఆయన కారులో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి హోదాలో సాయిరెడ్డి కూడా బయల్దేరారు. కారు బయల్దేరే ముందు కారు నుంచి సాయిరెడ్డిని కిందకు దింపేసి వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానిని జగన్ కారులో ఎక్కించుకున్నారు.
ఈ దృశ్యాలు మీడియాకు లీక్ అయ్యాయి. సాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టేశారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. జగన్ పీఆర్ టీమ్ దీని వెనుక ఉన్నట్టు గుర్తించిన సాయిరెడ్డి ఆ తర్వాత అందుకు బాధ్యులైన వారిపై చర్యల కోసం పలుమార్లు ఫిర్యాదు చేసినా జగన్ వాటిని పట్టించుకోలేదు. వారిని తొలగించాలని సాయిరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా సీఎం పట్టించుకోక పోవడంతోవారి మధ్య గ్యాప్ మొదలైనట్టు తెలుస్తోంది. జగన్ అండతోనే సాయిరెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నాలు మొదలైనట్టు ప్రచారం జరిగింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో భూముల వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రియల్ ఎస్టేట్, భూముల కొనుగోళ్లు, క్రయ విక్రయాలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఇవి తీవ్రం అయ్యాయి. అధికార పార్టీ నాయకులు ఎవరు నేరుగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండక పోవడం, పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తగిన ప్రాధాన్యత దక్కక పోవడంతో తాడేపల్లికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
వెరసి చివరకు ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి ఆ బాధ్యతలు జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. తాజాగా సుబ్బారెడ్డిని సాయిరెడ్డి టార్గెట్ చేయడానికి ఇదే కారణమనే అనుమానాలు కూడా ఉన్నాయి.
సాయిరెడ్డి హవా కొనసాగిన సమయంలో పార్టీలో తానే నంబర్ 2 అని ప్రకటించుకున్నారు. ఇది జగన్ చిన్నాన్న వైవీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారికి గిట్టలేదు. సాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రాన్ని శాసిస్తే సజ్జల తాడేపల్లికి పరిమితం అయ్యారు. సుబ్బారెడ్డి టీటీడీతో సర్దుకోవాల్సి వచ్చింది. అంతర్గత విభేదాలు, తాడేపల్లి పోరులో చివరకు సాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టారు. ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
సాయిరెడ్డి తర్వాత బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాలను చక్కబెట్టలేక పోయారనే అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పార్టీ వ్యవహారాలకు సాయిరెడ్డి దూరంగా ఉంటున్న సమయంలోనే అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు. దాంతో మళ్లీ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం మొదలైంది. ఆ తర్వాత నాలుగు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించారు. దానిపై కూడా విభేదాలు తలెత్తాయి. సాయిరెడ్డికి పూర్వ వైభవం వచ్చిందని ఆయన వర్గం ప్రచారం చేసుకున్నా అప్పటికే ఆయన స్థానాన్ని చెవిరెడ్డి ఆక్రమించారు. జగన్ వెన్నంటి ఉన్న వారు తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ పోరులో చివరకు సాయిరెడ్డి ఒంటరి అయ్యారు.
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన సాయిరెడ్డి గత మూడున్నరేళ్లలో క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు.కొన్ని సందర్భాల్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించిన ఉదంతాలు కూడా ఉన్నాయని, తాడేపల్లికి వెళ్లి వచ్చిన ప్రతిసారి అధినేత ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేదని సాయిరెడ్డి సన్నిహితులు చెప్పే మాట. నెల్లూరు పార్లమెంటు తరపున పోటీ చేయడం కూడా విధిలేని పరిస్థితుల్లోనే జరిగిందని, వేమిరెడ్డి పార్టీని వీడటం వెనుక సాయిరెడ్డి ప్రోత్సాహం ఉందనే అనుమానంతోనే.. సాయిరెడ్డికి నెల్లూరు ఎంపీ స్థానం బాధ్యతలు అప్పగించారనే వాదన కూడా ఉంది.
సాయిరెడ్డి కోటరీ పేరుతో చేసిన ఆరోపణలపై అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వైసీపీ నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీలో కోటరీ సాంప్రదాయాన్ని మొదలు పెట్టిందే సాయరెడ్డి అనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో ఎవరిని ఎదగనివ్వకుండా చేశారని, చాలా మంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులయ్యారని ప్రత్యర్థి వర్గం వాదనగా ఉంది.
సాయిరెడ్డి ఆరోపించిన వర్గంలో ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కెఎన్నార్, మీడియా సలహాదారులు, పిఆర్వోలు ఉంటారని, వారంతా సాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారని సాయిరెడ్డి అనుకూల వర్గం చెబుతోంది.
కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం వ్యక్తిగతంగా కూడా సాయిరెడ్డిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమార్తె కుటుంబం చిక్కుల్లో పడటం, సాయిరెడ్డి రాజకీయాల వల్ల వియ్యంకుడి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, వైసీపీ అధికారం నుంచి దూరమయ్యాక ఆయనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలో అన్ని సమస్యల నుంచి బయటపడటానికి తనకు తాను పరిష్కారం ఎదుర్కున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం వెనుక అసలు లక్ష్యం జగన్మోహన్ రెడ్డేనని చెబుతున్నారు. సాయిరెడ్డి ఇంత దూకుడు విమర్శలు చేయడం వెనుక ఎవరున్నారనే చర్చ కూడా రేకెత్తుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం