శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ సుప్రీమ్ కమాండర్ వరకు-నంబాల కేశవరావు ప్రస్థానం-rise of nambala keshava rao from srikakulam to maoist supreme leader ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ సుప్రీమ్ కమాండర్ వరకు-నంబాల కేశవరావు ప్రస్థానం

శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ సుప్రీమ్ కమాండర్ వరకు-నంబాల కేశవరావు ప్రస్థానం

ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(70) మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్రువీకరించారు. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం. కేశవరావుపై రూ.1.50 కోట్ల రివార్డు ఉంది.

శ్రీకాకుళం నుంచి మావోయిస్ట్ సుప్రీమ్ కమాండర్ వరకు-నంబాల కేశవరావు ప్రస్థానం

ఛత్తీస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు.

నంబాల ప్రస్థానం

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, క్రిష్ణ, వినయ్, బసవర రాజు, ప్రకాష్ ఇలా చాలా మారుపేర్లతో ఉద్యమాన్ని నడిపారు. 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా అనంతరం కేశవరావు మావోయిస్టు సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

వరంగల్ లో బీటెక్

స్వగ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించిన కేశవరావు....టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ చదువు, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. డిగ్రీ రెండో ఏడాది చదువుతుండగా వరంగల్‌లో బీటెక్‌ సీట్ రావడంతో అక్కడ జాయిన్ అయ్యారు. వరంగల్‌ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ చదువుతుండగానే నక్సలిజం వైపు అడుగులు వేశారు.

ఎంటెక్ మధ్యలోనే ఆపేసి

1984లో ఎంటెక్‌ చదువుతున్నప్పుడు సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై...చదువుకు స్వస్తి చెప్పి మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్థులు అంటున్నారు.

విప్లవ జోహార్లు

సీపీఐ మావోయిస్టు పార్టీ చీఫ్, జనరల్ సెక్రటరీ, మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నకు విప్లవ జోహార్లు అంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

1980 లో వరంగల్ ఆర్ఈసీ( ప్రస్తుత NIT college) లో బీటెక్ పూర్తి చేసి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 45 సంవత్సరాల పాటు పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను విడిచి ప్రజల కోసం అడవి బాట పట్టి దళ సభ్యుడి నుంచి మావోయిస్టు పార్టీ కి చీఫ్ గా ఎదిగాడు కేశవరావు.

మావోయిస్టు మొదటి చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత ఆ బాధ్యతలను 2016 లో నంబాల స్వీకరించారు.

గ్రూప్ వార్ లో అరెస్ట్

బీటెక్ చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్ వార్ గ్రూపు సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేశవరావును అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తన పేరును బసవరాజుగా మార్చుకున్నారు.

గెరిల్లా యుద్ధ తంత్రాలు

1987లో బస్తర్ అడవుల్లో ఎల్‌టీటీఈ మాజీ సైనికుల వద్ద గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఆయుధాల వినియోగంలో కేశవరావు ప్రత్యేక శిక్షణ పొందారు. ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో ఎక్స్ పర్ట్ అయ్యారు.

పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న కేశవరావు, మావోయిస్టు పార్టీలో అగ్రస్థానానికి ఎదిగారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా పనిచేశారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో కేశవరావు చురుగ్గా పాల్గొన్నారు.

కీలక దాడుల్లో సూత్రధారి

దేశవ్యాప్తంగా జరిగిన అనేక కీలక దాడుల్లో బసవరాజు ప్రధాన సూత్రధారి అని భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. 2010లో ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన భీకర దాడి, అలాగే 2019లో మహారాష్ట్ర గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతికి కారణమైన పేలుళ్ల వెనుక బసవరాజు కీలక పాత్ర పోషించారని పోలీసులు అంటున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం