సింహాచలం అప్పన చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత వారం సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం సందర్భంగా స్వామి వారి నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇరిగేషన్ ఇంజనీర్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఐజీ ఆకే రవికృష్ణలతో కూడిన కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
సింహాచలం దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిసభ్య కమిటీ ఛైర్మన్ , పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ నివేదికను సమర్పించారు. ఏప్రిల్ 30 తేదీన చందనోత్సవం రోజు సింహాచలంలో భారీ వర్షానికి గోడ కూలిన దుర్ఘటనలో 7గురు భక్తుల మృతి చెందారు. చందనోత్సవానికి ముందు మాస్టర్ ప్లాన్లో లేని గోడను ఆలయ అధికారులు నిర్మించారు.
కొండ ప్రాంతంలో ఎలాంటి పైల్ ఫౌండేషన్ లేకుండా రెండు అడుగుల వెడల్పుతో 70 అడుగుల పొడవున గోడను నిర్మించారు. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్ అభిప్రాయపడింది.
గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు నివేదికలో వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రశాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని, దీనిపై ఎలాంటి డిజైన్లు లేవని వివరించారు. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు, కనీసం పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్లో వివరించింది.
గోడ పటిష్టత గురించి, భక్తుల భద్రత గురించి ఎలాంటి తనిఖీలు చేయలేదని కమిషన్ పేర్కొంది. విశాఖ సీపీ సహా వివిధ శాఖలకు చెందిన సాక్షుల నుంచి స్టేట్మెంట్లు నమోదు చేసిన త్రిసభ్య కమిటీ ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ రావులు ప్రమాదానికి బాధ్యులని వీరందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
సంబంధిత కథనం