ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూనియర్ కాలేజీల్లో తాత్కలిక ప్రాతిపదికన పనిచేస్తోన్న కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచాలని కోరుతున్నా కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు.
వేతనాల పెంపుదల కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధనపై సమగ్రంగా అధ్యాయనం చేశారు. ఇకపై గెస్ట్ ఫ్యాకల్టీకి గంటకు రూ.375 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 27వేల వేతనాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పని చేస్తున్న 3,572 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి 2028 ఏప్రిల్ 30 వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను పునరుద్ధరించారు.
ప్రస్తుతం ఏపీలోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వారు 3,610 మంది ఉండగా.. 60 ఏళ్లు పూర్తయిన 47 మందిని మినహాయించి మిగిలిన వారికి కాంట్రాక్టులను పునరుద్దరించారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు గత ఏడాది మే నెలలో పని చేసిన కాలానికి జీతం చెల్లించడానికి మంత్రి నారా లోకేష్ సుముఖత తెలపడంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం