Tirumala : మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే
Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది.
Special Festivals at Tirumala: ఈ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. మార్చి 8వ తేదీన మహా శివరాత్రి వేడక జరగనున్నట్లు పేర్కొంది. మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు ఉంటాయని వెల్లడించింది. మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపింది.

మార్చిలో జరిగే విశేష ఉత్సవాలు :
• మార్చి 3న పల్స్ పోలియో.
• మార్చి 6, 20న సర్వ ఏకాదశి.
• మార్చి 8న మహాశివరాత్రి.
• మార్చి 20 నుంచి 24వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
• మార్చి 25న తుంబురు తీర్థ ముక్కోటి, శ్రీ లక్ష్మీ జయంతి.
TTD AUCTION : వేలానికి టీటీడీ ప్రకటన
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
– మార్చి 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
– మార్చి 10న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
– మార్చి 19న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు.
– మార్చి 25న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.
డయల్ యువర్ ఈవో(Dial Your EO program) కార్యక్రమం మార్చి 2వ తేదీ శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.