ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు ఊరట.. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ నిబంధనలో సడలింపు.. డిగ్రీ మార్కుల నిబంధన కూడా మార్పు…-relief for ap mega dsc candidates relaxation in the rules for uploading certificates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు ఊరట.. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ నిబంధనలో సడలింపు.. డిగ్రీ మార్కుల నిబంధన కూడా మార్పు…

ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు ఊరట.. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ నిబంధనలో సడలింపు.. డిగ్రీ మార్కుల నిబంధన కూడా మార్పు…

Sarath Chandra.B HT Telugu

ఏపీ మెగా డిఎస్సీ 2025 అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు చెప్పారు. డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నిబంధనలతో అభ్యర‌్థులు ఇబ్బంది పడుతుండటంతో సడలింపులు ప్రకటించారు. దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలనే నిబంధనలు సడలించారు. డిగ్రీ, పీజీ మార్కుల నిబంధనల్ని కూడా సవరించారు.

డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు చెప్పిన మంత్రి నారా లోకేష్‌

ఏపీ మెగా డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల విడుదలైన డిఎస్సీ నోటిఫికేషన్‌లో విధించిన పలు నిబంధనలతో అభ‌్యర్థులు ఇబ్బందులు పడుతుండటంత వాటిని సవరిస్తున్నట్టు నారా లోకేష్‌ ఎక్స్‌లో ప్రకటించారు.

డిఎస్సీ ఆశావహులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు చెప్పారు. దరఖాస్తు చేసే సమయంలోనే సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలనే నిబంధనతో అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ, ప్రైవేట్ అభ్యర్థులు అవసరమైన పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

డిఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల కోసం కీలకమైన సమయం వృధా అవుతున్న విషయాన్ని గుర్తించిన మానవ వనరుల శాఖ మంత్రి నారాలోకేష్‌ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. దరఖాస్తు చేసే సమయంలో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయడం ఆప్షనల్ మాత్రమేనని, సర్టిఫికెట్ వెరిఫకేషన్ సమయంలో ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.

40శాతం మార్కులు చాలు..

గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ మార్కుల నిబంధనల్లో కూడా సడలింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్‌ , పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లలో కనీస విద్యార్హత 40శాతంగా నిర్ణయించినట్టు ప్రకటించారు. కనీసం 45-50శాతం మార్కుల ఉండాలని తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో లక్షలాది మందికి డిఎస్సీకు దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అర్హత మార్కులను తగ్గించారు.

ఫిజిక్స్‌ అర్హతలపై వివాదం..

డిఎస్సీలో ఫిజిక్స్‌-కెమిస్ట్రీ పోస్టులకు విద్యార్హతల విషయంలో గందరగోళం నెలకొంది. కొన్ని పోస్టులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు చదవని బిసిఏ అభ్యర్థులను అనుమతించి, బిఎస్సీ కంప్యూటర్స్‌లను అనుమతించడం లేదని, బిఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన వారికి కెమిస్ట్రీ స్థానంలో కంప్యూటర్స్‌ బోధిస్తారని, బిసిఏ అభ్యర్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండవని డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు. బిఎస్సీ కంప్యూటర్స్‌ అభ్యర్థులను అనుమతించకుండా బిసిఏ చదివిన వారిని అనుమతించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం