Pilli Vs Chelluboyina : కోనసీమ జిల్లా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. దీంతో సొంత పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తున్నాయి. రామచంద్రాపురం వైసీపీ ఇదేవిధంగా వర్గపోరు మొదలైంది. మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రికి వ్యతిరేకంగా పిల్లి సుభాష్ వర్గం సమావేశాలు నిర్వహిస్తోందని సమాచారం. మంత్రి చెల్లుబోయినకు టికెట్ ఇస్తే ఓడిస్తామని మరో వర్గం బహిరంగంగానే ప్రకటనలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కొడుక్కి ఇప్పించాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తున్నారు. ఈ సీటును వదులుకునేందుకు మంత్రి వేణుగోపాల కృష్ణ సుముఖంగా లేరని సమాచారం. దీంతో రామచంద్రాపురం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు.
తాజాగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అనుచరుడు... ఉదయ్ చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. సోమవారం నియోజకవర్గంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి మంత్రి వేణు, ఆయన అనుచరులు హాజరయ్యారు. ఆదివారం ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు నిర్వహించిన సమావేశానికి మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ శివాజీ హాజరయ్యారు. ఆ సమావేశానికి ఎందుకు వెళ్లావంటూ శివాజీపై మంత్రి అనుచరుడు ఉదయ్ చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న మంత్రి అతడిని శాంతింపజేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన శివాజీ చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. శివాజీని రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పేరుతో ఆదివారం స్థానిక మాధవానంద కల్యాణ మండపంలో మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కొందరు వైసీపీ నేతలు మంత్రి వేణుపై విమర్శలు చేశారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కు కాకుండా వేణుగోపాల కృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామని హెచ్చరించారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 26న అమలాపురం సభలో సీఎం జగన్ ను కలిసి ఈ తీర్మానంపై వివరిస్తామని పిల్లి సుభాష్ వర్గీయులు అంటున్నారు. ఈ విషయంపై మంత్రి చెల్లుబోయిన స్పందిస్తూ... రామచంద్రపురంలో వైసీపీలో తనకు వ్యతిరేకంగా ఏం జరగడం లేదన్నారు. అసమ్మతి నేతల ఆరోపణలను హారాలుగా మలుచుకుంటానన్నారు. ఈ సమావేశం ఎందుకు జరిగిందో ప్రజలకు, సీఎం జగన్కు తెలుసని చెప్పుకొచ్చారు.