Tirupathi SPW College: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాల..ప్రొఫెసర్‌ రాజేశ్వరి మూర్తి కృషి ఫలితమే..-rajeshwari murthy is the only professor behind the rise of tirupati womens college success ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupathi Spw College: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాల..ప్రొఫెసర్‌ రాజేశ్వరి మూర్తి కృషి ఫలితమే..

Tirupathi SPW College: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాల..ప్రొఫెసర్‌ రాజేశ్వరి మూర్తి కృషి ఫలితమే..

Sarath chandra.B HT Telugu
Dec 15, 2023 05:00 AM IST

Tirupathi SPW College: ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కళాశాల ఏర్పాటు, అభివృద్ధి వెనుక ఓ మహిళ నిరంతర కృషి, తపన దాగి ఉన్నాయి. ప్రొఫెసర్ రాజేశ్వరి మూర్తి నిరంతర శ్రమతో మహిళా విద్యకు బాటలు ఏర్పడ్డాయి.

ప్రొఫెసర్ రాజేశ్వరి మూర్తి
ప్రొఫెసర్ రాజేశ్వరి మూర్తి

Tirupathi SPW College: ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బాలుర కాలేజీల్లో బాలికల్ని చేర్చుకోరాదని మద్రాసు యూనివర్శిటీ తీర్మానం టీటీడీ చొరవతో ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల ఏర్పాటైంది. ఆ కాలేజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మహిళ శతవసంతాలు పూర్తి చేసుకున్నారు.

yearly horoscope entry point

Tirupathi SPW College: ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటైంది.అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బాలుర కళాశాలల్లో బాలికల్ని చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది.అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగేళ్లు మాత్రమే.మద్రాసు యూనివర్శిటీ నిర్ణయంతో స్త్రీ విద్యకు ఆదిలోనే గండిపడింది.తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా మద్రాసు వర్శిటీ నిర్ణయంతో, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది.

ఈ లోటును పూడ్చడానికి 1952లో టీటీడీ 'శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల'ను స్థాపించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతంలో ఏర్పాటైన తొలి మహిళా కళాశాల అది. ఆ కాలేజీకి రంగనాయకమ్మ మొదటి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. రెండేళ్ళ తరువాత ఆమె నిష్క్రమించారు.తిరుపతిలో మహిళా కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ ఏర్పాటైంది.అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణి రాజేశ్వరి మూర్తి 1954లో మహిళా కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్‌గా పగ్గాలు చేపట్టారు.

ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు….

అప్పటి వరకు శ్రీ వేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా రాజేశ్వరి దేవి రాక 'శ్రీపద్మావతి మహిళా కళాశాల' (ఎస్పీడబ్ల్యూ)గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో అది కాస్త డిగ్రీ కళాశాలగా మారింది.అప్పటికి కళాశాలకు సొంత భవనాలులేవు.ప్రాక్టి కల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు విద్యార్ధినులు వెళ్ళాల్సి వచ్చేది.

మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? వంటి విషయాలు రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఎస్పీడబ్ల్యు కళాశాల రూపుదాల్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కళాశాల కోసం వంద ఎకరాలను ఆమె సేకరించారు.

పెళ్లి తర్వాత చదువుకుని…

కాకినాడకు సమీపంలోని పెద్దాపురానికి చెందిన సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు.ప్రొఫెసర్‌ సూర్యనారాయణ మూర్తితో పెళ్ళి అయ్యాక.. భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు.గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఆ దంపతులకు పిల్లలు లేరు.

రాత్రి, పగలు అనకుండా కళాశాల ప్రాంగణమే ఆమెకు ఇల్లు అయిపోయింది.అదే ఆమెకు జీవితం అయిపోయింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, ఒకటేమిటి మహిళల్లో విద్యా వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో,వాటి కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ ఆ రోజుల్లోనే రాజేశ్వరి వినియోగించారు.

విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపరమైన సంబంధాలను నెలకొల్పారు. కాలేజీలో బోధన కోసం కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు. ఫలితంగా అనతి కాలంలోనే రాష్ట్రంలోనే అత్యుత్తమ కళాశాలగా శ్రీ పద్మావతి మహిళా కళాశాలను తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే,అక్కడే అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు.

నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు, “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. వెంటనే ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహామహులను కళాశాలకు రప్పించారు. ఒక ఆడబిడ్డను..కన్నతల్లి తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను తీర్చిదిద్దారు.

కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు కళాశాలకు చెందినవి ఉండేవి. టీటీడీ అధికారుల నివాసాల కోసం నాటి ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డారు.ఈవో ఆమె పై అధికారి. ఆ తర్వాత మరొక ఈవోతో ఆమెకు అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు.

ఆ అవార్డు కూడా కాలేజీకి అంకితం...

అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు.అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేకపోయారు.తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్ప డబ్ల్యూ కళాశాలతో పాటు ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు.కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు.అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది. తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు. ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు.ఆమె వద్ద చదువుకున్న తొలి బ్యాచ్ విద్యార్థులు ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు. న్యూయార్కులో ఉంటూ, నూరేళ్లు దాటిన వయసులో కూడా తన పనులు తానే చేసుకుంటున్నారు. 2021 డిసెంబర్ 10తో ప్రొఫెసర్ రాజేశ్వరి మూర్తి శత వసంతాలు పూర్తి చేసుకున్నారు.

ఆమె ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞాన తృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాటలు వేశారు. న్యూయార్క్ లో ఇప్పటికీ సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటున్నారు.

Courtesy: Prof.Vasudeva Reddy garu and Raghava sharma,

(సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ గుండు ఫేస్‌బుక్‌ పేజీ నుంచి సేకరణ)

Whats_app_banner