AP Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
గురువారం రాత్రి 8 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 79.5మిమీ, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 77.7మిమీ, శ్రీకాకుళం జిల్లా నందిగంలో 65మిమీ, అల్లూరి జిల్లా అరకులో 55మిమీ, విజయనగరం నెల్లిమర్లలో 51మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని, దాదాపు 88 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు ప్రకటించారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఆంధ్రా వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా వడగాల్పులు తగ్గుముఖం పట్టడంతో నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్లోని చాలా ప్రాంతాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది.
మహారాష్ట్ర-ఉత్తర కేరళ తీరాల్లో సముద్ర మట్టం వద్ద ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. మధ్య గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి, ఈ తుఫాను నుంచి పశ్చిమ బిహార్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, గుజరాత్ రాష్ట్రం, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ గఢ్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణ, మరాఠ్వాడా, తమిళనాడులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తుపాను ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో జూన్ 27 నుంచి జూలై 1 వరకు కొంకణ్, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 27, 28 తేదీల్లో కోస్తా కర్ణాటక, సౌరాష్ట్ర, కచ్, జూన్ 27న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, మాహే, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.