AP Weather Update: ఆంధ్రాలో మూడు రోజుల పాటు వానలు.. పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం…
AP Weather Update: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇటీవలి కాలంలో నైరుతి రుతుపవనాలు స్తబ్దతగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి కదలిక చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
AP Weather Update: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఊదురుగాలులు వీస్తాయని అధికారుల చెబుతున్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల వైయస్ఆర్, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అలానే అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
పది జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో పది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కుందని ఐఎండీ తెలిపింది. బుధవారం, గురువారం, శుక్రవారాల్లో ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అలాగే ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడి అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు హరిపురం (శ్రీకాకుళం) 4.5 సెంటీ మీటర్లు, సాలూరు (పార్వతీపురం మన్యం) 4.7 సెంటీ మీటర్లు, దత్తిరాజేరు (విజయనగరం) 3.8 సెంటీ మీటర్లు, పెందుర్తి (విశాఖపట్నం) 4.5 సెంటీ మీటర్లు, కొక్కిరాపల్లి (అనకాపల్లి) 7.3 సెంటీ మీటర్లు, అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు) 5.2 సెంటీ మీటర్లు, డి.పోలవరం (కాకినాడ) 4.1 సెంటీ మీటర్లు వర్షపాతం నమోదు అయింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో నేడు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)