AP Weather Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. నవంబర్ 11 నుంచి వర్షాలు
Andhra Pradesh Weather News : శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ నివేదిక పేర్కొంది. ఈ ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి.
శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేస్తోంది. అమరావతి భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, అల్పపీడనం వాయువ్య దిశగా తమిళనాడు-పుదుచ్చేరి(Tamil Nadu-Puduchery) తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో స్వల్పంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
అల్పపీడనం ఏర్పడిన 48 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ(IMD) తెలిపింది. నవంబర్ 11 నుంచి తమిళనాడు, రాయలసీమ(Rayalaseema)ల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర ప్రదేశ్లో వర్షాలు ఉండవని వివరించింది. మరింత బలపడితే.. నవంబర్ 11, నవంబర్ 12 తేదీలలో విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 11న సాయంత్రం వైజాగ్ రానున్నారు. , మరుసటి రోజు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తాయని IMD నివేదిక తెలిపింది.
మరోవైపు తెలంగాణ(Telangana)లో వర్షాలు లేవు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. అదేవిధంగా రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతూ ఉంది. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయింది. మరో రెండు రోజులపాటు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్(Adilabad)లో పగటి ఉష్ణోగ్రత అత్యధికంగా 33.8 డిగ్రీలు నమోదు అయ్యాయి. మెదక్(Medak)లో అత్యల్పంగా 13 డిగ్రీల రాత్రిపూట ఉష్ణోగ్రత నమోదైంది. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.
ఇంకోవైపు భాగ్యనగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతోంది. హైదరాబాద్(Hyderabad)లో గరిష్ట ఉష్ణోగ్రత 30.5గా నమోదు అవ్వగా.. కనిష్ట ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదు అయింది. ఈశాన్య, తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తు్న్నాయి.